Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.21.5 కోట్లు కలెక్ట్‌ చేసిన '2.0'

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.21.5 కోట్లు కలెక్ట్‌ చేసిన '2.0'
, శుక్రవారం, 30 నవంబరు 2018 (18:07 IST)
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన భారీ విజువల్‌ వండర్‌ '2.0'. 3డి, 2డి ఫార్మాట్‌లో తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో నవంబర్‌ 29న గ్రాండ్‌గా విడుదలైంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఎన్‌.వి.ఆర్‌. సినిమా సంస్థ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్‌తో సూపర్‌ డూపర్‌ హిట్‌ టాక్‌ సాధించిన ఈ సినిమా మొదటి రోజు రూ.110 కోట్లు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. 
 
కాగా, తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.21.5 కోట్లు దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా ఎన్‌.వి.ఆర్‌. సినిమా అధినేత ఎన్‌.వి.ప్రసాద్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ అధినేత దిల్‌రాజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

 
ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ ''ప్రపంచవ్యాప్తంగా నిన్న రిలీజ్‌ అయిన '2.0' సంచలనమైన కలెక్షన్లతో అద్భుత విజయంతో దూసుకెళ్తోంది. నిన్న మొదటి రోజు మన తెలుగు రాష్ట్రాల్లో రూ.21.5 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఈరోజు కూడా అన్ని ఏరియాల్లో, అన్ని థియేటర్స్‌ హౌస్‌ఫుల్స్‌ అవుతున్నాయి. ఇది ఒక విజువల్‌ వండర్‌. అద్భుతంగా తెరకెక్కించిన లైకా ప్రొడక్షన్స్‌ సుభాస్కరన్‌గారికి, డైరెక్టర్‌ శంకర్‌గారికి, రజనీకాంత్‌గారికి, అక్షయ్‌కుమార్‌గారికి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. 
 
ఇది సంచలన విజయం సాధించే చిత్రంగా దూసుకెళ్ళి డబ్బింగ్‌ సినిమా చరిత్రలోనే సంచలనం సృష్టిస్తుందని మేం ఆశిస్తున్నాం. ప్రేక్షకుల ఆశీర్వాదం ఈ సినిమాకి ఉంది. మీ ఆదరణ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. 2డి ఫార్మాట్‌లో చూసినవాళ్ళు 3డి లో కూడా చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం 3డిలో ఎక్కడా టిక్కెట్స్‌ లేవు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్న సినిమా, విజువల్‌ ఫీస్ట్‌గా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే సినిమా ఇది. పాన్‌ ఇండియన్‌ సినిమాని వరల్డ్‌ సినిమాగా తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నం ఇది. ఈ సినిమా సంచలన విజయం దిశగా దూసుకెళ్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. 
 
నాలుగు సంవత్సరాలు చిత్ర యూనిట్‌ పడిన కష్టం సినిమాలో కనిపిస్తుంది. దానికి ప్రతిఫలంగానే ప్రేక్షకులు సినిమాలోని రజనీకాంత్‌ అవతారాలన్నింటినీ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఒక కొత్త సందేశంతో కూడుకున్న ఈ సినిమా ఇంకా సంచలన రికార్డులు సాధించాలని కోరుకుంటున్నాం'' అన్నారు. 
 
 
దిల్‌రాజు మాట్లాడుతూ ''2.0 చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. నేను మూడు సార్లు చూశాను. ఈమధ్యకాలంలో ఏ సినిమానీ అన్నిసార్లు చూడలేదు. ఉదయం 5 గంటలకు 3డిలో చూశాను. ఆ తర్వాత బిగ్‌ స్క్రీన్‌పై 3డిలో చూశాను. ఆ తర్వాత శ్రీరాములు థియేటర్‌లో 2డి కూడా చూశాను. విజువల్‌గా సినిమాలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి కాబట్టి 3డిలో చేశారు. అయితే 2డిలో కూడా నాకు పెద్దగా డిఫరెన్స్‌ కనిపించలేదు. 2డిలో కూడా అదే ఇంపాక్ట్‌ ఉంది. 2డిలో కూడా నేను బాగా ఎంజాయ్‌ చేశాను. రోబో చిత్రాన్ని ఎలా ఎంజాయ్‌ చేశామో ఆ రేంజ్‌లోనే 2డిలో కూడా ఉంది. 3డి అద్భుతమైతే, 2డి వెరీగుడ్‌. 
 
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.21.5 కోట్లు కలెక్ట్‌ చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఆల్‌మోస్ట్‌ ఒక పెద్ద హీరో సినిమా తెలుగులో రిలీజ్‌ అయితే ఎలాంటి కలెక్షన్స్‌ ఉన్నాయో అలా '2.0' చిత్రం కలెక్ట్‌ చేసింది. మనకు తెలిసి ఇండస్ట్రీలో నవంబర్‌ ఎండ్‌, మార్చి అన్‌‌సీజన్‌గా గుర్తించాం. ప్రసాద్‌గారు ఈ ప్రపోజల్‌ చెప్పినపుడు డిస్ట్రిబ్యూటర్‌గా నవంబర్‌లో రిలీజ్‌ చెయ్యడం కరెక్టేనా అని ఆయన్ని అడిగాను. తమిళ్, హిందీలో కూడా ఆల్రెడీ ఫిక్స్‌ అయ్యారు కాబట్టి చేద్దాం అన్నారు. అయితే నవంబర్‌లో రిలీజ్‌ అయినా సినిమా బాగుంటే ప్రేక్షకులు దాన్ని ఏ రేంజ్‌కి తీసుకెళ్తారో ఇంతకుముందు చూడడం జరిగింది. 
 
నిన్ననే రిలీజ్‌ అయిన సినిమా కాబట్టి పిల్లలు స్టార్ట్‌ అయ్యాక, ఫ్యామిలీస్‌ కూడా థియేటర్‌కి వస్తారు. ఫ్యామిలీస్‌ కూడా వస్తే సినిమా మరొక లెవల్‌కి వెళ్తుందని నా అంచనా. మనకే ఇలా ఉందంటే చిన్నపిల్లలకి ఒక విజువల్‌ వండర్‌. ఇలాంటి సినిమా శంకర్‌గారి వల్లే సాధ్యమైంది. గత 20 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సినిమాలు చూస్తే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. శంకర్‌గారు ఈ సినిమాని హాలీవుడ్‌ స్థాయిలో విజువల్‌గా చూపించారు. ఇండియన్‌ సినిమాలోనే ఇంత భారీ బడ్జెట్‌ సినిమా ఇంతవరకు రాలేదు. సినిమా మొత్తం ఒక ఎత్తయితే చివరి 20 నిమిషాలు మరో ఎత్తు. 
 
శంకర్‌గారు ఎన్ని చేసినా చివరలో ఫార్ములాను తీసుకొచ్చి రజనీకాంత్‌గారితో మేజిక్‌ చూపించారు. ఆ 20 నిమిషాల ట్రెమండస్‌ ఫీలింగ్‌తోనే ఆడియన్స్‌ థియేటర్‌ నుంచి బయటికి వస్తున్నారు. చూసినవాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటున్నారు. సాధారణంగా ప్రతి సినిమాకీ పైరసీ చూడకండి థియేటర్‌లోనే చూడండి అని చెప్తుంటాం. పైరసీలో చూస్తే ఈ సినిమా ఎవరికీ అర్థం కాదు. తప్పనిసరిగా థియేటర్‌లోనే చూడాలి. కాబట్టి ఈ సినిమాకి లాంగ్‌ రన్‌ ఉంటుంది. ఈ సినిమా నడుస్తూనే ఉంటుంది. సంక్రాంతి వరకు ఈ సినిమా కంటిన్యూ అవుతుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాను. 
 
ఇంత మంచి సినిమా తీసిన శంకర్‌గారికి, లైకా ప్రొడక్షన్స్‌కి థాంక్స్‌. ఇలాంటి సినిమాని ప్రసాద్‌గారు, మేము, యు.వి.క్రియేషన్స్‌ కలిసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశాం. డిస్ట్రిబ్యూషన్‌లో ఒక సక్సెస్‌ఫుల్‌ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్న మాకు ఇలాంటి గ్రేట్‌ ఫిలిం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని చూసిన సెలబ్రిటీస్‌ ట్విట్టర్‌లో ఉన్నవారు అక్కడ తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈరోజు 'మహర్షి' షూటింగ్‌కి వెళ్ళగానే మహేష్‌గారు ఈ సినిమా గురించి చెప్పారు. 'ఏం తీశారండీ శంకర్‌గారు. చాలా బాగుంది. గౌతమ్‌ మళ్ళీ చూడాలని అంటున్నాడు' అన్నారు. ఒకసారి బిగ్‌ స్క్రీన్‌కి పంపిద్దామని నేనే చెప్పాను. గౌతమ్‌లాంటి చిన్నబాబుకి మళ్ళీ సినిమా చూడాలనిపించిందంటే పిల్లలు ఎంతగా ఈ సినిమాని ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు'' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ కరెన్సీ పతనం - ఒక్క డాలర్ రూ.144