Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దశాబ్దకాలంలో నాలుగో పార్టీ... ఇదీ అవంతి శ్రీనివాస్ జంపింగ్ హిస్టరీ

దశాబ్దకాలంలో నాలుగో పార్టీ... ఇదీ అవంతి శ్రీనివాస్ జంపింగ్ హిస్టరీ
, శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (12:23 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆ పార్టీతో పాటు తన లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాలో చేరిపోయారు. వాస్తవానికి అవంతి శ్రీనివాస్ పార్టీ మారబోతున్నారంటూ గత ఆర్నెల్లుగా ప్రచారం సాగుతోంది. అది నేటికి నిజమైంది. 
 
ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడుగా ఉన్న అవంతి శ్రీనివాస్.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించి, భీమిలి లేదా విశాఖపట్టణం నార్త్ అసెంబ్లీ స్థానాల్లో ఒకదాన్ని కేటాయించాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కోరారు. దీనికి ఆయన ససేమిరా అన్నట్టు సమాచారం. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అవంతి దూరంగా ఉంటూ వచ్చారు. అదేసమయంలో ఆయన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలతో టచ్‌లో ఉంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో గురువారం టీడీపీతో పాటు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్‍‌లోని జగన్ నివాసమైన లోటస్‌పాండ్‌కు వెళ్లి వైకాపా కండువా కప్పుకున్నారు. అయితే, గత పదేళ్ళలో అవంతి శ్రీనివాస్ పార్టీ మారడం ఇది నాలుగోసారి. 
 
విశాఖలో ప్రముఖ విద్యా సంస్థల అధినేతగా పేరుగడించిన అవంతి... గత 2009లో సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అదే యేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. పిమ్మట 2011లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దీంతో అవంతి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 
 
2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడిన అవంతి.. టీడీపీ గూటికి వచ్చారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇపుడు అంటే 2019లో తిరిగి టీడీపీకి రాజీనామా చేసి వైకాపాలో చేరారు. నిజానికి అవంతి శ్రీనివాస్ ఎంపీ పదవీకాలం మరో రెండుమూడు నెలల్లో ముగియనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ సైనికుడిగా నా రక్తం మరిగిపోతోంది : వీకే సింగ్