Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రత్యేక హోదా కోసం ఏ ఒక్కరైనా నిజమైన ఉద్యమం చేశారా? షర్మిల ప్రశ్న

ys sharmila

వరుణ్

, ఆదివారం, 21 జనవరి 2024 (17:03 IST)
విభజన హామీల్లో భాగంగా, ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాపై రాష్ట్రంలోని ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా నిజమైన ఉద్యమం చేసిందా అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆమె ఆదివారం ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆమె కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. వైకాపా, తెదేపా దొందూ దొందేనని మండిపడ్డారు. గత పదేళ్లలో ఆ రెండు పార్టీల పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. పార్టీలోకి తాను రావాలని కేడర్‌ కోరుకుందని.. వారందరికీ ధన్యవాదాలు చెప్పారు.
 
 
'రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న అప్పు రూ.లక్ష కోట్లు. చంద్రబాబు రూ.2 లక్షల కోట్లు చేస్తే.. ప్రస్తుత సీఎం జగన్‌ రెడ్డి రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు. కార్పొరేషన్‌ రుణాలు, ఇతర బకాయిలు అన్నీ కలిపితే రూ.10 లక్షల కోట్ల భారం రాష్ట్రంపై ఉంది. ఇంత అప్పు చేసినా రాష్ట్ర అభివృద్ధి జరిగిందా? అని బూతద్దంలో వెతికినా కనిపించదు. రాష్ట్రానికి రాజధాని ఉందా? 
 
విజయవాడలో కనీసం ఒక మెట్రో అయినా ఉందా? ఈ పదేళ్లలో కనీసం 10 పెద్ద పరిశ్రమలైనా వచ్చాయా? రోడ్లు వేసుకోవడానికి కూడా నిధుల్లేని పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వడం లేదు. దేనికీ డబ్బు లేదు.. అభివృద్ధి జరగడం లేదు. దళితులపై దాడులు మాత్రం వందకు వంద శాతం పెరిగాయి. ఎక్కడ చూసినా మైనింగ్‌, ఇసుక మాఫియా దోచుకోవడం.. దాచుకోవడం.
 
ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు రావడంతో పాటు పన్ను రాయితీలు లభిస్తాయి.. యువతకు ఉద్యోగాలు వస్తాయి. దాన్ని తీసుకురావడంలో పాలకులు విఫలమయ్యారు. హోదా కోసం చంద్రబాబు ఎప్పుడైనా ఉద్యమం చేశారా? ఉద్యమించే వాళ్లను జైల్లో పెట్టారు. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేకహోదా కోసం నిరాహారదీక్షలు కూడా చేశారు. సీఎం అయిన తర్వాత ఒక్కసారైనా ఆయన నిజమైన ఉద్యమం చేశారా? 
 
స్వలాభం కోసం ఇద్దరూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారు. రాష్ట్రానికి నేడు ప్రత్యేకహోదా కాదు కదా.. ప్యాకేజీ కూడా లేదు. ఈ పాపం జగన్‌, చంద్రబాబులదే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని భాజాపాకు ఆ రెండు పార్టీలు ఎందుకు సహకరిస్తున్నాయి? బయటికి విభేదిస్తున్నట్టు కనిపిస్తూనే మద్దతు ఇస్తున్నాయి. మణిపుర్‌లో క్రైస్తవులపై దాడులు జరిగితే ఆ మతానికి చెందిన వ్యక్తిగా జగన్ ఎందుకు స్పందించలేదు? రాజశేఖర్ రెడ్డి ఆశయాల కాంగ్రెస్ తోనే సాధ్యం.
 
రాజధాని అమరావతిని చంద్రబాబు పూర్తిచేయలేదు. జగన్‌ మూడు రాజధానులని చెప్పి ఒక్కటీ చేయలేదు. రాజధాని ఏదంటే ఇప్పుడు ఏమీ అర్థం కాని పరిస్థితి. 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు పనులు చాలా వరకు పూర్తయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో రైతుల ఖర్చులు పదింతలు పెరిగాయి. అప్పులేని రైతు ఉన్నారా? ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తామన్న భాజపా హామీ ఏమైంది? 22 మంది వైకాపా ఎంపీలు, ముగ్గురు తెదేపా ఎంపీలు కేంద్రంలోని భాజపా చేతుల్లో ఉన్నారు. ఆ పార్టీ ఏం చెబితే అది చేస్తున్నారు అని షర్మిల ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ మందిర నిర్మాణం కోసం రూ.1100 కోట్ల ఖర్చు