Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మందడంలో సంక్రాంతి భోగి వేడుకలు.. హాజరైన చంద్రబాబు - పవన్ కళ్యాణ్

bhogi celebrations

వరుణ్

, ఆదివారం, 14 జనవరి 2024 (10:42 IST)
అమరావతి రాజధాని గ్రామం మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. అమరావతి ఐకాస, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ‘తెలుగు జాతికి స్వర్ణయుగం - సంక్రాంతి సంకల్పం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
తొలుత చంద్రబాబు, పవన్‌కు ఇరుపార్టీల శ్రేణులతో పాటు రాజధాని రైతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నేతలిద్దరూ భోగిమంటలు వెలిగించారు. వైకాపా ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను మంటల్లో వేసి నిరసన తెలిపారు. 
 
చంద్రబాబు, పవన్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పిల్లలు, పెద్దలు పోటీపడ్డారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే, జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. 
 
మరోవైపు, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారి పల్లెలో సంక్రాంతి సందడి మొదలైంది. ప్రతి యేటా సంక్రాంతికి నారా, నందమూరి కుటుంబసభ్యులు నారావారిపల్లెకు వెళ్లి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. ఈసారి.. నారా భువనేశ్వరి, మనవడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, వారి చిన్న కుమార్తె తేజస్విని. నందమూరి రామకృష్ణ, కంఠమనేని శ్రీనివాస్, లోకేశ్వరి, ఇందిర తదితరులు శుక్రవారమే గ్రామానికి చేరుకున్నారు. 
 
ఆదివారం భోగి సంబరాల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత గ్రామంలో జరిగే ముగ్గుల పోటీలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు నారా భువనేశ్వరి బహుమతులు అందజేస్తారు. కాగా, చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం హెలికాఫ్టర్లో అక్కడికి చేరుకుంటారని, అందుకోసం హెలిప్యాడ్ సిద్ధం చేశామని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పులివర్తి నాని పేర్కొన్నారు. 
 
సాయంత్రానికి లోకేశ్, బ్రాహ్మణి వస్తారని తెలిపారు. ఈసారి సందర్శకుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉందని, ఇందుకు తగిన విధంగా భోజన, వసతి, వాహనాల పార్కింగ్ కోసం స్థల కేటాయింపుతో పాటూ అన్ని రకాల ఏర్పాట్లూ చేస్తున్నట్టు వివరించారు. శనివారం నారా, నందమూరి కుటుంబసభ్యులు గ్రామ సమీపంలోని కల్యాణి జలాశయానికి వెళ్లి గంటపాటు గడిపారు. కట్ట దిగువన ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అపార్ట్‌మెంట్ రెసిడెన్స్ అసోసియేషన్స్ జీఎస్టీ చెల్లించాలా? వద్దా?