బలపడిన వాయుగుండం... నెల్లూరుకు ఆగ్నేయంగా కదులుతూ...
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది. ఇప్పటివరకు ఉత్తర దిశగా కదిలిన వాయుగుండం కాస్త దిశను మార్చుకొని ఉత్తర ఈశాన్యానికి కదులుతోంది. రాగల 24 గంటల్లో ఇది తుపా
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది. ఇప్పటివరకు ఉత్తర దిశగా కదిలిన వాయుగుండం కాస్త దిశను మార్చుకొని ఉత్తర ఈశాన్యానికి కదులుతోంది. రాగల 24 గంటల్లో ఇది తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటివరకు తమిళనాడు తీరంపైనే ఎక్కువగా ప్రభావం చూపిన వాయుగుండం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో అధిక ప్రభావం చూపనుంది.
వాయుగుండం మరో 24 గంటల పాటు ఏపీ తీరానికి సమాంతరంగా కదిలి గురువారం లోగా తుపానుగా మారనుంది. ఇది క్రమంగా ఒడిశా తీరం వైపు పయనిస్తోందని అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్పై తీవ్రంగా కన్పిస్తోంది. దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నెల్లూరులో 18 సెం.మీ, సూళ్లూరుపేట, శ్రీహరికోట, రాపూరు ప్రాంతాల్లో 15 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.
ఉత్తర కోస్తాలోని విశాఖ జిల్లాలో నిన్న రాత్రి, ఇవాళ ఉదయం ఓ మోస్తరు వర్షం కురిసింది. విశాఖలో 2 సెం.మీల వర్షపాతం నమోదైంది. మరో 48 గంటలపాటు రాష్ట్రంపై వాయుగుండం, తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కోస్తా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దక్షిణ కోస్తాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ, గంగవరం పోర్టుల్లోనూ ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ వాయుగుండం ప్రభావంతో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.