Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిస్టరీగా మారిన వ్యక్తి మృతి... హత్య చేసింది ఎవరు?

మిస్టరీగా మారిన వ్యక్తి మృతి... హత్య చేసింది ఎవరు?
, శనివారం, 27 అక్టోబరు 2018 (16:24 IST)
కడప నగర శివారులో ఉరిమెళ్ల రాజేష్‌ కుమార్ ‌(22) అనే వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు. రాజేష్‌ కుమార్‌ను తీసుకెళ్లిన మేస్త్రీ, మరో నలుగురు కారణం అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విశ్వసనీయవర్గాలు, బంధువుల ఆరోపణలు, చిన్నచౌక్‌ పోలీసుల వివరాల మేరకు... చిన్నచౌక్‌ అశోక్‌ నగర్‌కు చెందిన శివకుమారి, తల్లిదండ్రులు లేని తన అక్క కుమారుడైన రాజేష్‌కుమార్‌(22)ను చేరదీసి, తనతోపాటు జీవనం సాగించేది. రాజేష్‌ కుమార్‌ ఎర్రముక్కపల్లెకు చెందిన గిరినాగప్రసాద్‌ అనే వ్యక్తి దగ్గర రాడ్‌ బెండింగ్‌ పని చేసేవాడు.
 
2016 జూన్‌ 15న అట్లూరు మండలం, వేమలూరుకు చెందిన కొండయ్య కుమార్తె మమతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి రియా(1) సంతానం ఉంది. వివాహ సమయంలో రాజేష్‌ కుమార్‌ మేస్త్రీ దగ్గర రూ.40 వేలు చేబదులు తీసుకున్నాడు. తన భార్య మమత ప్రసవానికి వెళ్లిన సమయంలో రాజేష్‌ కుమార్, మేస్త్రీ మధ్య విబేధాలు రావడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చేరిన వెంటనే మేస్త్రీ వచ్చి, ఎలాంటి ఫిర్యాదులు చేయకుండానే రాజీ కుదుర్చుకుని, ఇటీవల 4 నెలల నుంచి మరలా తన దగ్గరే పనికి తీసుకెళ్లేవాడు. 
 
ప్రస్తుతం కొద్దిరోజుల నుంచి తన భార్య, బిడ్డతో పాటు వేరుగా ఉంటున్నాడు. ఈ నెల 21న మేస్త్రీ గిరినాగప్రసాద్‌తో పాటు బయటకు వెళుతున్నానని భార్యతో చెప్పాడు. సాయంత్రం అయినా భర్త రాకపోవడంతో ఫోన్‌ చేస్తే స్పందించలేదు. తర్వాత మేస్త్రీకి ఫోన్‌ చేస్తే, తమ ఇంటి వద్దకు వచ్చి, రాజేష్‌ కుమార్‌ ఇక రాడని.. బెదిరించి వెళ్లినట్లు మమత ఆరోపించారు.
 
మంగళవారం సాయంత్రం మమత, తన చిన్నత్త శివకుమారి, తండ్రి కొండయ్యతో కలిసి చిన్నచౌక్‌ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం గండి వాటర్‌ వర్క్స్‌ సమీపంలో రాజేష్‌ కుమార్‌ మృతదేహం బాగా ఉబ్బి బయటపడింది. ఘటనా స్థలం వద్దే మృతదేహానికి రిమ్స్‌ వైద్యులు శవపంచనామా నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ ప్రఖ్యాత విద్యాలయంలో లైంగిక వేధింపులు... విద్యార్థిని అపూర్వ...