Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ జ్ఞానోదయం ముందే కలిగి ఉంటే జగన్‌కి క్రెడిట్ పోయేది కాదు కదా బాబుగారూ..

గురి చూసి కొడితే ఆ దెబ్బ ఎంత బలంగా తాకుతుందో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అర్థం అయినట్లుగా మరెవరికీ అర్థమై ఉండదు. హామీలు ఇచ్చి అమలు చేయడంలో వెనుకబడిపోయారన్న అపఖ్యాతిని మూటగట్టుకున్న చంద్రబాబు వైకాపా ప్లీనరీలో ఇటీవల వైఎస్ జగన్ ప్రకటించిన ముం

ఈ జ్ఞానోదయం ముందే కలిగి ఉంటే జగన్‌కి క్రెడిట్ పోయేది కాదు కదా బాబుగారూ..
హైదరాబాద్ , బుధవారం, 19 జులై 2017 (02:08 IST)
గురి చూసి కొడితే ఆ దెబ్బ ఎంత బలంగా తాకుతుందో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అర్థం అయినట్లుగా మరెవరికీ అర్థమై ఉండదు. హామీలు ఇచ్చి అమలు చేయడంలో వెనుకబడిపోయారన్న అపఖ్యాతిని మూటగట్టుకున్న చంద్రబాబు వైకాపా ప్లీనరీలో ఇటీవల వైఎస్ జగన్ ప్రకటించిన ముందస్తు హామీల ద్వారా ప్రభుత్వానికి తగలనున్న దెబ్బను వేగంగా పసిగట్టారు. ఆ ప్లీనరీలో జగన్ ప్రకటించిన కీలక హామీలను అమలు చేసే బాధ్యతను ఇప్పుడే తనపై వేసుకున్నారు చంద్రబాబు. మహిళల అసంతృప్తి తారాస్థాయికి చేరుకుందని గ్రహించిన తెలుగుదేశం ప్రభుత్వం బుధవారం నుంచి  రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే జగన్ హామీ ఇచ్చిన కిడ్నీ బాధితులకు పెన్షన్ కార్యక్రమాన్ని ఇప్పటి నుంచే మొదలుపెట్టేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని కిడ్నీ బాధితులకు రూ. 2,500ల పెన్షన్ ఇవ్వాలని మంగళవారం సాయంత్రం ఏపీ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. 
 
ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌కు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాల’  ఎఫెక్ట్‌ తగిలింది. తాము అధికారంలోకి వస్తే కిడ్నీ బాధితులకు పెన్షన్‌ ఇస్తామని వైఎస్‌ జగన్‌ ఇటీవల జరిగిన వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీలో ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, ప్రకాశం జిల్లాల్లో పర్యటన సందర్భంలోనూ ఆయన కిడ్ని బాధితులకు పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ హామీతో దిగొచ్చిన ఏపీ సర్కార్‌ కిడ్ని బాధితులకు రూ.2,500 పెన్షన్‌ ఇవ్వాలని మంగళవారం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.  కాగా ఏపీ కేబినెట్‌ మంగళవారం సుదీర్ఘంగా సమావేశమైంది. సుమారు నాలుగు గంటల పాటు పలు అంశాలపై చర్చించింది. కేబినెట్‌ నిర్ణయాలు ఏమిటంటే.. 
 
రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని బెల్ట్‌షాపుల మూసివేతకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అంతేకాకుండా రోడ్లపై మద్యం తాగుతూ కన్పిస్తే అరెస్టుచేయాలని  అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ మద్యం వాడకం నివారణకు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. 
 
ఇసుక అక్రమ రవాణాపైనా సుదీర్ఘంగా చర్చించారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో నలుగురితో కమిటీ వేయాలని నిర్ణయించారు. కలెక్టర్‌, ఎస్పీతో పాటు మరో ఇద్దరితో ఈ కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇసుక మాఫియాతో సంబంధం ఉన్నవారందరినీ అరెస్టుచేయాలని సీఎం ఆదేశించారు. ఇసుక రవాణా ఛార్జీలపైనా నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే ఇసుక రవాణాకు కిలోమీటర్‌కు ఒకే రకమైన ధర ఖరారు చేయాలని నిర్ణయించారు.
 
ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి చర్చించారు. ఏపీలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ పేదరికంతో ఇబ్బందులు పడుతున్నవారిని ఆదుకోవాలని నిర్ణయించారు. వారికి నెలకు రూ.2500 చొప్పున పింఛను ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా కిడ్నీ వ్యాధులపై పరిశోధనకు శ్రీకారం చుట్టనున్నాయి. ఇందుకయ్యే సగం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. 
 
రాష్ట్రంలో 2014కు పూర్వం ఇళ్లు మంజూరైనప్పటికీ వివిధ కారణాల రీత్యా పూర్తిచేయలేని వారికి అండగా నిలవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న సుమారు 2.90 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో వారందరికీ రూ.25వేల చొప్పున ఇచ్చి ఆదుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.500 కోట్లను గ్రామీణ గృహ నిర్మాణ శాఖకు కేటాయించినట్టు మంత్రి కాలువ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో సుమారు 2లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుంది.
 
ఇవన్నీ బాగున్నాయి. నిజంగా అమలైతే లక్షలాది కుటుంబాలకు మేలు కలిగే నిర్ణయాలనడంలో సందేహమే లేదు. కానీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్లీనరీలో ప్రకటించకపోతే చంద్రబాబు ఇంతటి కీలక నిర్ణయాలకు పూనుకునేవారేనే అనేది సమాధానం లేని ప్రశ్నగా ఉండిపోతోంది. ఇప్పుడైనా ప్రకటించిన ప్రజాకర్షక నిర్ణయాలను ఏమేరకు ప్రజలందరికీ పార్టీ రహితంగా అంద జేస్తాననే అనుమానం ప్రజల్లో ప్రబలంగా ఉంటోది. ప్రకటించిన పథకాలను ఎంత పకడ్బందీగా అమలు చేస్తారనే అంశమే ప్రభుత్వ ప్రతిష్టను పెంచుతుందని కానీ హామీ ఇచ్చేసి ఊరకుండిపోతే దొడ్డిదోవ ప్రయత్నాలకు దిగితే అంతకు అంత చెడ్డ పేరు రావడం ఖాయమని రాజకీయ వరిశీలకుల అభిప్రాయం. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంకయ్యనాయుడు సొంత ఊరు... బయోగ్రఫీ(వీడియో)