Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధ్యయుగాల వైభవానికి సజీవ సాక్ష్యం "సిద్ధవటం"

మధ్యయుగాల వైభవానికి సజీవ సాక్ష్యం
FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన ఓ మండలమే "సిద్ధవటం". ఇక్కడ ఉన్న "సిద్ధవటం కోట" మధ్యయుగాలనాటి కళా వైభవానికి సజీవ సాక్ష్యంగా నేటికీ అలరారుతోంది. దక్షిణం దిశగా పెన్నానది, మిగిలిన మూడువైపులా లోతైన అగడ్తలతో శత్రు దుర్భేద్యంగా నిర్మించిన ఈ కోట ఆంధ్రప్రదేశ్ చారిత్రక సంపదలలో ఒకటిగా భాసిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్‌ దర్శనీయ స్థలాల్లో ఒకటైన సిద్ధవటం కోటను వేసవి సెలవుల్లో ఎంచక్కా అలా చుట్టివచ్చేద్దామా..?!

సిద్ధవటం కోటకు పడమటి దిశగా ఒకటి, తూర్పు దిశగా మరొకటి ద్వారాలున్నాయి. ముఖద్వారం రెండువైపులా ఆంజనేయస్వామి, గరుత్మంతుడి శిల్పాలు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి. పశ్చిమ ద్వారం ఇరువైపులా నాట్య భంగిమలో ఉండే అందమైన శిల్పాలు చూపరులను కట్టిపడేస్తాయి. పశ్చిమ ద్వారం లోపలి పై భాగంలో రాహువు గ్రహణం పట్టడం, గ్రహణం వదలటాన్ని వివరంగా తెలిపేలా చిత్రాలు ఆకట్టుకుంటాయి.

కోట మధ్య భాగంలోని అంతఃపురం మాత్రం నేడు శిథిల దశలో ఉండగా.. రాణి దర్బారు, ఈద్గా మసీదు, దానికి సమీపంలోని నగారాఖానాలు మాత్రం బాగానే ఉన్నాయి. నగారాఖానాకు వెనుకవైపు కోట గోడకు మధ్యలో ఓ తాగునీటి కోనేరు ఉంది. అలాగే కోట లోపల సిద్ధవటేశ్వర స్వామివారి ఆలయం, దానికి ఎదురుగా నంది విగ్రహం పర్యాటకులను, భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. అలాగే ఈ ఆలయం పక్కనే ఉన్న కామాక్షి ఆలయం శిథిల దశలో ఉండగా, నేడు మరమ్మత్తులతో మనోహరంగా తీర్చిదిద్దారు.

ఇక కోట తూర్పు ద్వారానికి సమీపంలో షావలి దర్గా చూడదగ్గ మరో ప్రదేశం. దీనిని టిప్పు సుల్తాన్ కాలంలో నిర్మించినట్లుగా స్థానికులు చెబుతుంటారు. దాని ప్రక్కనే మసీదు.. ఆ మసీదుకు తూర్పుదిశగా కోట గోడలోకి ఓ సొరంగ మార్గాన్ని ఏట్లోకి కలుపుతూ నిర్మించారు. ఆ రోజుల్లో చక్ర యంత్రం ద్వారా ఏటిలోని నీటిని మసీదులోగల తొట్టిలోకి తోడేవారని పూర్వీకులు చెబుతుంటారు.

కోట చరిత్రను చూస్తే.. శ్రీ కృష్ణదేవరాయలవారి అల్లుడు వరదరాజు ముందుగా ఈ సిద్ధవటం కోటను పరిపాలించేవాడు. అంతకు ముందు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో భాగంగా ఉండేది. రెండవ వెంకటపతిరాయలకు మట్లి ఎల్లమరాజు యుద్ధాలలో బాగా సహకరించేవాడు. అందుకు గుర్తుగా అమరనాయకరంగా సిద్ధవటాన్ని ఎల్లమరాజుకుకు కానుకగా ఇచ్చాడు. అంతేగాకుండా మరికొన్ని ప్రాంతాలను సిద్ధవటానికి చేర్చాడు.

అనంతరం మట్లి అనంతరాజు మట్టికోటగా ఉన్న "సిద్ధవటం కోట"ను శత్రు దుర్భేద్యమైన రాతి కోటగా నిర్మించాడు. అలాగే తన తండ్రి పేరుతో ఎల్లమరాజు చెరువును, తనపేరుతో అనంతరాజు చెరువును కూడా తవ్వించాడు. అలా కాలం గడుస్తుండగా మట్లి రాజుల పతనం తరువాత సిద్ధవటం ఔరంగజేబు సేనాని మీర్ జుమ్లా ఆక్రమణలోకి వచ్చింది.

ఆ తర్వాత ఆర్కాట్ నవాబుల స్వాధీనంలోకి వెళ్లిన ఈ ప్రాంతాన్ని, అప్పట్లో కడపను పరిపాలించే అబ్దుల్ నబీఖాన్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆయన తరువాత మయనా నవాబుల పాలనలో ఉన్న సిద్ధవటం అనంతరం ఈస్టిండియా కంపెనీ స్వాధీనంలోకి వెళ్లిపోయింది.

సిద్ధవటం మండలం గురించి చెప్పుకోవాలంటే.. ఇది కడప పట్టణం నుంచి భాకరాపేట మీదుగా బద్వేలు వెళ్లే మార్గంలో పెన్నానది ఒడ్డున ఉంది. కడప పట్టణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధవటంలో ఎక్కువగా సిద్ధులు నివసిస్తుంటారు. ఈ ప్రాంతంలో వట వక్షాలు (మర్రి చెట్లు) విస్తారంగా పెరుగుతుంటాయి. అందుకే సిద్ధులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో వట వృక్షాలు కూడా విస్తారంగా ఉన్నందున ఈ ప్రాంతానికి సిద్ధవటం అనే పేరు వచ్చినట్లుగా స్థానికులు చెబుతుంటారు.

అప్పట్లో సిద్ధవటం పరిసర ప్రాంతాలలో జైనులు ఎక్కువగా నివసించేవారట. ఓ కాలంలో జిల్లా కేంద్రంగా ఉన్న సిద్ధవటాన్ని.. పెన్నానది పొంగినప్పుడల్లా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్న కారణంగా దాన్ని కడపకు మార్చారట. ఇక్కడున్న మధ్యయుగాలనాటి సిద్ధవటం కోటను 1956వ సంవత్సరంలో పురావస్తు శాఖ స్వాధీనంలోకి తీసుకుంది. అదలా ఉంచితే.. సిద్ధవటం మండలం సమీపంలోని ఏటి పొడవునా ఉన్న అనేక ఆలయాలు కూడా చూడదగ్గవే. వీటిలో రంగనాథస్వామి ఆలయం చెప్పుకోదగ్గది. అలాగే భాకరా పంతులు పేరుతో నిర్మించి 16 స్తంభాల మంటపం తప్పక చూడాల్సిన ప్రదేశమే.

Share this Story:

Follow Webdunia telugu