Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెలికాం రంగంలో ట్రెండ్ సెట్టర్ ‘జియో’.. సంచలనాల మోత... ఇతర టెల్కోల గుండెల్లో రైళ్లు...

టెలికాం మార్కెట్‌ను హడలెత్తించిన జియో రెండు వసంతాలను పూర్తి చేసుకుంది. 2016 సెప్టెంబర్ 5న మొదలైన జియో డిజిటల్ ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆ క్షణాన మొదలైన జియో ట్రెండ్‌... ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేశీయ టెలికాం మార్కెట్‌లోనే కాకుండా... ప్రపంచవ

టెలికాం రంగంలో ట్రెండ్ సెట్టర్ ‘జియో’.. సంచలనాల మోత... ఇతర టెల్కోల గుండెల్లో రైళ్లు...
, గురువారం, 6 సెప్టెంబరు 2018 (17:26 IST)
టెలికాం మార్కెట్‌ను హడలెత్తించిన జియో రెండు వసంతాలను పూర్తి చేసుకుంది. 2016 సెప్టెంబర్ 5న మొదలైన జియో డిజిటల్ ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆ క్షణాన మొదలైన జియో ట్రెండ్‌... ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేశీయ టెలికాం మార్కెట్‌లోనే కాకుండా... ప్రపంచవ్యాప్తంగా జియో తానేంటో నిరూపించుకుంటూ అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. ఈ రెండేళ్ల ప్రయాణంలో దేశీయ టెలికాం సర్వీసులపై జియో చూపిన ప్రభావమెంతో చూద్దాం.
 
జియో ఎంట్రీ తర్వాత మొబైల్‌ డేటా వినియోగం భారత్లో నెలకు 20 కోట్ల జీబీ నుంచి 370 కోట్ల జీబీకి పెరిగింది. కేవలం జియో కస్టమర్లే 240 కోట్ల జీబీ డేటాను వినియోగిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. జియో లాంచ్‌ అయిన నెలల్లోనే, ప్రపంచంలోనే నెంబర్‌ కంపెనీగా ఎదిగింది. కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది కస్టమర్లను తన సొంతం చేసుకుంది. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను జియో తన ఖాతాలో వేసుకుంది. ఇలా తన నెట్‌వర్క్‌ను పెంచుకుంటూ పోతూ.. 2018 జూన్‌ 30 నాటికి 21.5 కోట్ల మందికి పైగా కస్టమర్లను చేరుకుంది.
 
భారత్‌లో ఎల్‌టీఈ కవరేజ్‌ ఎక్కువగా జియోకే ఉంది. 99 శాతం భారత జనాభాను త్వరలో జియోనే కవర్‌ చేయబోతుంది. అన్ని టారిఫ్‌ ప్లాన్లపై ఉచిత అపరిమిత కాలింగ్‌ ఆఫర్‌ చేసిన కంపెనీ జియోనే. అప్పటి వరకు ఏ కంపెనీ కూడా అలా ఆఫర్‌ చేయలేదు. జియో తీసిన ఈ అపరిమిత సంచలనంతో, మిగతా అన్ని కంపెనీలు కూడా ఉచితాల బాట పట్టాయి. డేటాను ధరలను కూడా తగ్గించాయి.
 
జియో లాంచ్‌ తర్వాత, 250 రూపాయల నుంచి 10వేల రూపాయల మధ్యలో ఉన్న ఒక్క జీబీ డేటా ధర, ప్రస్తుతం 15 రూపాయలకు తగ్గింది. అంటే అంతకముందు డేటా ఛార్జీల బాదుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జియో లాంచింగ్‌ తర్వాత డేటా ధరలు భారీగా కుప్పకూలి, సామాన్యుడికి చేరువలో ఇంటర్నెట్‌ వచ్చేసింది.
 
ఇప్పటికీ కూడా జియో తీసుకొస్తున్న కొత్త కొత్త టారిఫ్‌ ప్లాన్లతో ఇతర టెల్కోల గుండెల్లో రైళ్లు పెడుతున్నాయి. ఆయా కంపెనీలు కూడా జియో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టిన వెంటనే, దానికి కౌంటర్‌గా టారిఫ్‌ ధరలను తగ్గిస్తూ పోతున్నాయి. ఇలా టెలికాం మార్కెట్‌లో అసాధారణమైన పోటీ నెలకొంది. జియో దెబ్బకు చాలా కంపెనీలు మూత పడటం, మరికొన్ని కంపెనీలు విలీనమవడం జరిగింది. 4జీ నెట్‌వర్క్ కవరేజ్‌లో జియోనే ఆధిపత్య స్థానంలో ఉన్నట్టు ట్రాయ్‌ స్పీడ్‌టెస్ట్‌ పోర్టల్‌ వెల్లడించింది.
 
జియో ఎంట్రీ అనంతరం, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు యూజర్‌ బేస్‌ పెరిగింది. అంటే పరోక్షంగా ఈ కంపెనీలకు కూడా జియో బాగా సహకరించింది. జియో కార్యకలాపాలు లాంచ్‌ అయినప్పటి నుంచి గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు భారత్‌ మోస్ట్‌ యాక్టివ్‌ మార్కెట్‌గా మారింది. ఎల్‌వైఎఫ్‌ బ్రాండ్‌ కింద వాయిస్‌ఓవర్‌ ఎల్‌టీఈ డివైజ్‌లను కూడా రిలయన్స్‌ రిటైల్‌ లాంచ్‌ చేసింది. జియో అరంగేట్రం తర్వాత ఈ డివైజ్‌ల సరుకు రవాణా పెరిగింది. ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లోనూ జియో సంచలనానికి తెరలేపింది. జియోఫోన్‌ పేరుతో కొత్త ఫీచర్‌ ఫోన్‌ను ప్రవేశపెట్టి, మరింత మంది కస్టమర్లను ఆకట్టుకుంది. ఇటీవలే ఫీచర్‌ ఫోన్‌లో హైఎండ్‌ మోడల్‌ జియోఫోన్‌ 2ను కూడా ఆవిష్కరించింది.
 
దీంతో పాటు బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లోకి జియో అడుగుపెట్టింది. జియో గిగాఫైబర్‌ పేరుతో ఫైబర్‌ ఆధారిత వైర్‌లైన్‌ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2018 ఆగస్టు 15 నుంచి దీని రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది. భారత్‌ను గ్లోబల్‌గా ఆధిపత్య స్థానంలో నిల్చోబెట్టడమే లక్ష్యంగా జియో ముందుకు సాగుతుందని ఆ కంపెనీ అధినేత ముఖేష్‌ అంబానీ పలుమార్లు పునరుద్ఘాటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోటల్ గదిలో నటి శవమై కనిపించింది... ఏం జరిగింది?