Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నైలో భారత్‌ను గెలిపించిన విరాట్ కోహ్లీ - కేఎల్ రాహుల్

kohli - rahul
, ఆదివారం, 8 అక్టోబరు 2023 (22:00 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌లు పుణ్యమాని భారత్ ఈ టోర్నీలో తొలి గెలుపును సాధించింది. 
 
ఓ దేశలో రెండు రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్‌ను కోహ్లీ - రాహుల్ జోడీ ఆదుకుంది. చివరి వరకూ మ్యాచ్‌ను నిలబెట్టిన కోహ్లీ తన వ్యక్తిగత స్కోరు 85 రన్స్ వద్ద ఔట్ అయ్యాడు. రాహుల్ మాత్రం 97 పరుగులు చేసి మరో మూడు పరుగుల దూరంలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 11 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 200 పరుగుల విజయలక్ష్యాన్ని 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 201 పరుగులు చేసి విజయఢంకా మోగించింది. 
 
ఈ వరల్డ్ కప్ ఐదో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విధించిన 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియాకు ప్రారంభంలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. సారధి రోహిత్ శర్మ సహా ఓపెనర్ ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ డకౌట్ కావడంతో మూడు వికెట్లు కోల్పోయి టీం ఇండియా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ.. జట్టు పరిస్థితి చక్కదిద్దే బాధ్యత తలకెత్తుకున్నారు.
 
ఆస్ట్రేలియా బౌలర్ల దాడిని తట్టుకుని.. ఆచితూచి ఆడుతూ.. సింగిల్స్ తీస్తూ.. అడపాదడపా బంతిని బౌండరీ బాట పట్టిస్తూ.. క్రమంగా జట్టు స్కోర్ పెంచుతూ వచ్చారు. కమిన్స్ 26వ ఓవర్ మూడో బంతిని సింగిల్గా మలిచి విరాట్ కోహ్లీ, 28వ ఓవర్ తొలి బంతితో సింగిల్ తీసి కేఎల్ రాహుల్ చెరో అర్థ శతకం పూర్తి చేశారు. 
 
38వ ఓవర్‌లో హేజిల్ వుడ్ వేసిన నాలుగో బంతిని లబుషేన్..  క్యాచ్ పట్టడంతో కోహ్లీ ఔట్ కావడంతో నాలుగో వికెట్ భాగస్వామ్యానికి 165 పరుగులతో తెర పడింది. ఆ తర్వాత మ్యాచ్‌ను హార్దిక్ పాండ్యాతో కలిసి కేఎల్ రాహుల్ పూర్తి చేశాడు. దీంతో ఈ వరల్డ్ కప్‌లో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లో గెలుపొందింది. 
 
అంతముందు టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు.. భారత స్పిన్నర్లు విజృంభించడంతో 199 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో భారత్‌ ఎదుట 200 పరుగుల లక్ష్యం ఉంది. స్టీవ్ స్మిత్ (46) టాప్‌ స్కోరర్‌. డేవిడ్ వార్నర్‌ (41), మార్నస్ లబుషేన్ (27), మ్యాక్స్‌వెల్ (15), పాట్ కమిన్స్‌ (15) పరుగులు చేశారు. మిచెల్ మార్ష్ (0), అలెక్స్‌ (0) పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. 
 
చివర్లో మిచెల్ స్టార్క్ (28; 35 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడటంతో ఆసీస్‌ ఆ మాత్రమైనా పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (3/28), కుల్‌దీప్‌ యాదవ్ (2/42), జస్‌ప్రీత్ బుమ్రా (2/35), అశ్విన్‌ (1/34) ఆసీస్‌ను కట్టడి చేశారు. సిరాజ్‌, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న కంగారులు.. ముగ్గురు డకౌట్