Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరల్డ్ కప్ విజేత ఇంగ్లండే కానీ.. భారత మహిళా జట్టుకు అభినందనల వెల్లువ

తుది క్షణాల్లో కేవలం అనుభవ రాహిత్యంతోనే అరుదైన ప్రపంచ కప్‌ను పోగొట్టుకున్నారు. కానీ కప్‌ గెలవలేకపోయినా సిరీస్‌ ఆద్యంతం అద్భుతంగా ఆడిన భారత మహిళలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే మహిళా క్రికె

వరల్డ్ కప్ విజేత ఇంగ్లండే కానీ.. భారత మహిళా జట్టుకు అభినందనల వెల్లువ
హైదరాబాద్ , ఆదివారం, 23 జులై 2017 (23:20 IST)
టీమిండియా మహిళా జట్టు విజయానికి అతిదగ్గరగా వచ్చి కళ్లముందే విజయం చేజార్చుకుందంటే కేవలం అనుభవ రాహిత్యమే కారణం. ఇద్దరే ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు..కెప్టెన్ మిథాలీరాజ్, గో్స్వామి. వీరిద్దరూ మినహా జట్టు మొత్తం యువరక్తంతో తొణికిసలాడేవాళ్లే. అయినా తలవంచలేదు. కానీ తుది క్షణాల్లో కేవలం అనుభవ రాహిత్యంతోనే అరుదైన ప్రపంచ కప్‌ను పోగొట్టుకున్నారు. కానీ కప్‌ గెలవలేకపోయినా సిరీస్‌ ఆద్యంతం అద్భుతంగా ఆడిన భారత మహిళలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే మహిళా క్రికెట్‌లో అత్యంత పటిష్టమైన జట్లను కూడా వరుసగా ఓడిస్తూ కోటానుకోట్లమంది భారత అభిమానులల్లో ఆశలు రేపారు. దురదృష్టం కొద్దీ గెలిచి తీరవలసిన గేమ్‌ను చివరి ఓవర్లలోనే  ప్రత్యర్థికి అందించారు.

విజయం  దూరమైనప్పటికీ వరల్డ్ కప్ ఫైనల్ వరకూ మన అమ్మాయిలు ప్రదర్శించిన అద్భుత ప్రతిభను దేశ యావత్తూ కొనియాడుతోంది.
 
మిథాలీ రాజ్, జులాన్ గోస్వామి. ఒకరు టీమిండియా కెప్టెన్, మరొకరు స్టార్ బౌలర్. వీరిద్దరికి ఇదే చివరి వరల్డ్ కప్ గేమ్. కానీ కప్ గెలువకుండానే నిష్క్రమించబోతున్నారు. ఆట అంటే ఇదేనేమో మరి. కానీ ఒక జట్టుగా టీమిండియా సాధించిన ఫీట్ మాత్రం అద్భుతం అనే చెప్పాలి. చారిత్రాత్మక విజయాన్ని సెమీస్‌లో అందుకున్నాక త్రుటిలో ఫైనల్‌లో కప్పును చేజార్చుకుని ఉండవచ్చు కానీ టీమిండియా ఈసారి ప్రదర్శించిన ఆట తీరు రాబోయే యువ ప్లేయర్లకు స్ఫూర్తి దాయకంగానే నిలుస్తుంది. వారు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రోత్సాహాన్నిస్తుంది. 
 
మన అమ్మాయిలు పతకాన్ని కాస్త తేడాతో చేజార్చుకున్నప్పటికీ భారతీయ అభిమానులు నిరాశ చెందలేదు. మీరు సాధించిన విజయాలు అసామాన్యం. తుది విజయం దక్కలేదని బాధపడద్దు అంటూ సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ సాంత్వన చెబుతున్నారు. 
 
ఇండియన్ గర్ల్స్.. ఈ ఓటమి నిరాశ కలిగించి ఉండవచ్చు. కానీ కుప్పుకూలిపోవద్దు. ఫైనల్ చేరే క్రమంలో ఇంగ్లండ్, ఆస్ట్లేలియా, న్యూజిలాండ్ మూడు గొప్ప టీమ్‌లను ఓడించారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడినుంచి మీరు ముందుకు సాగండి. మీరు నిజంగానే బాగా ఆడారు. వచ్చే నాలుగేళ్లలో మీరు మరింత రాటుదేలుతారని, మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నాం. మిథాలి, జులాన్, వేగదా, హర్మన్ ప్రీత్ కౌర్, పూనమ్, స్మృతి, షికా, ఏక్తా సుష్మా రాజేశ్వరి, పూనమ్ జట్టులోని ప్రతి ఒక్కరూ అవసరమైన సమయాల్లో ఆదుకున్నారు. యువ ప్లేయర్లుగా మీరు ఇకపై ఎదుగుతారు, మరింతగా నేర్చుకుంటారు. నిరాశ చెందవద్దు అని భారతీయులు ముక్తకంఠంతో మన అమ్మాయిల జట్టును సపోర్ట్ చేస్తున్నారు.
 
బ్రిటిష్ గడ్డపై జయకేతనం ఎగరేయాలనుకున్న భారత్‌ తృటిలో అవకాశాన్ని చేజార్చుకుంది. మహిళల వన్డే వరల్డ్ కప్‌ ట్రోఫీని ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు చేజిక్కించుకుంది. ‘క్రికెట్‌ మక్కా’  లార్డ్స్‌ వేదికగా ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌ పోరులో టీమిండియాపై ఇంగ్లండ్‌ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్రిటీష్‌ జట్టు విసిరిన 229 పరుగులను ఛేధించేక్రమంలో ఇండియా 48.4 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్‌ ప్రపంచ విజేత కావడం ఇది నాలుగోసారి కావడం విశేషం.
 
229 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా పూర్తిచేయగలదనిపించిన ఇండియా ఆఖరి ఓవర్లలో ఉసూరుమనిపించింది. 86 పరుగులతో వీరవిహారం చేసిన ఓపెనర్‌ రౌత్‌ 4వ వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత టీమిండియా పేకమేడలా కూలిపోయింది. మరో ఓపెనర్‌ మంధనా డకౌట్‌ కాగా, కెప్టెన్‌ మిథాలీ 17 పరుగులు మాత్రమే చేసింది. సెమీస్‌లో రికార్డు స్కోరు సాధించిన హర్మీత్‌ కౌర్‌ (51), ఐదో స్థానంలో వచ్చిన కృష్ణమూర్తి (35)లు తమ వంతు పరుగులు చేశారు. అయితే లోయర్‌ మిడిలార్డర్‌ దారుణంగా విఫలం చెందడం, టెయిలెండర్లు నిమిషాల్లోనే పెవిలియన్‌కు దారిపట్టడంతో ఇండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ ష్రబ్‌షోల్‌ ఏకంగా 6 వికెట్లు పగడొట్టి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మరో బౌలర్‌ హార్ట్లే 2 వికెట్లు సాధించింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుండె పగిలిన టీమ్ ఇండియా.. 9 పరుగుల తేడాతో చేజారిన వరల్డ్ కప్..విజేత ఇంగ్లాండ్