Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళను వాహనంతో ఢీకొట్టించి.. సామూహిక అత్యాచారం...

victim
, శుక్రవారం, 14 అక్టోబరు 2022 (08:43 IST)
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కాయగూరలు అమ్ముకుని ఇంటికి వెళుతున్న ఓ మహిళపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒంటరిగా ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఆమెను వెంబడించి, వాహనంతో ఢీకొట్టించి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ దారుణం జిల్లాలోని ఒంగోలు మండలం, కొప్పోలు - గుత్తికొండవారిపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన కథనం మేరకు... ఓ వివాహిత రోజూ ఒంగోలుకు ద్విచక్రవాహనంపై వచ్చి కూరగాయలు అమ్ముకుని తిరిగి వెళ్లేది. మంగళవారం రాత్రి 10.30 సమయంలో ఆమె స్వగ్రామానికి వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై ఆమెను వెంబడించారు. 
 
నిర్మానుష్య ప్రాంతంలో ఆమె వాహనాన్ని ఢీకొట్టి, మహిళను పక్కనున్న పొదల్లోకి లాక్కెళ్లారు. ఆమె కేకలు వేస్తూ ప్రతిఘటించినా వదల్లేదు. అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఆలస్యమవుతున్నా ఆమె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. 
 
దారిలో తారసపడిన ఆమె.. తనపై ఇద్దరు యువకులు దాడిచేసి అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పారు. నిందితుల కోసం బంధువులు గాలిస్తుండగా కొత్తపట్నం రోడ్డులోని ఒక పెట్రోల్‌బంకు సమీపంలో కనిపించారు. పట్టుకునేలోపే అక్కడి నుంచి పరారయ్యారు. 
 
దీనిపై బాధితురాలు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు, తాలూకా సీఐ వి.శ్రీనివాసరెడ్డి బాధితురాలిని విచారించి వివరాలు సేకరించారు. సంఘటన స్థలానికి గురువారం చేరుకుని పరిశీలించారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. కొప్పోలు గ్రామంలో చేపల చెరువు వద్ద కాపలాగా ఉన్న ఇద్దరు వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలంద్వారంలో కేజీ బంగారం దాచి అక్రమ రవాణా..