Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌లో కీలక పరిణామం : ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్!!

shahbaz sharif

ఠాగూర్

, బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (09:40 IST)
పాకిస్థాన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధానమంత్రిగా మరోమారు షహబాజ్ షరీఫ్ నియమితులయ్యారు. ఈ మేరకు పీఎంఎల్ - ఎన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ మేకు షహబాజ్ పేరును పీఎంఎల్ క్యూ పార్టీ నామినేట్ చేసింది. దీంతో పాకిస్థాన్ ప్రధానిగా షహబాజ్ మరోమారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పాకిస్థాన్ ఎన్నికల తర్వాత నాలుగోసారి పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ (74) బాధ్యతలు చేపడతారని అంతా ఊహిస్తున్న వేళ ఈ షాకింగ్ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు ఎక్స్(ట్విటర్)లో వివరాలు వెల్లడించారు. తమ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ తన సోదరుడు షహబాజ్ షరీఫ్ను ప్రధాని పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. 
 
ఇక నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ (50)ను పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పీఎంఎల్-ఎన్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్దతు ఇచ్చిన పలు రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా నవాజ్ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పాకిస్థాన్ సంక్షోభాల నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
పాక్ జాతీయ అసెంబ్లీలో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన సీట్లు రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. దీంతో పాక్ సైన్యం ఆశీస్సులున్న నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో చర్చలు జరిపింది. అయితే బిలావల్ భుట్టో జర్దారీ ప్రధాని పదవి ఆశిస్తున్నారని, ఇరు పార్టీలు ప్రధాని పదవిని పంచుకోవాలని వార్తలు వెలువడ్డాయి. 
 
ఈ క్రమంలో పాక్ ప్రధాని పదవి రేసు నుంచి పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో తాజాగా వైదొలిగినట్లు ప్రకటించారు. నూతన ప్రభుత్వంలో తమ పార్టీ భాగమవ్వకుండానే.. 'పీఎంఎల్-ఎన్' ప్రధాని అభ్యర్థికి మద్దతు ఇస్తుందని తెలిపారు. దీంతో నవాజ్ షరీఫ్ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపడతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన తన తమ్ముడిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. కాగా, 265 స్థానాలున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలుపొందారు. పీఎంఎల్-ఎన్ 75 స్థానాల్లో, పీపీపీ 54 స్థానాల్లో గెలుపొందింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండిగో విమానంలో శాండ్‌విచ్.. ఇనుప స్క్రూ.. వైరల్