Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరుసగా ఐదో విజయంతో ఎదురులేని ముంబై.. హషీమ్‌ ఆమ్లా మెరుపు సెంచరీ వృథా

ఇండోర్‌ ఐపీఎల్‌ పదో సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ చెలరేగుతోంది. 199 పరుగుల లక్ష్యాన్ని ఏమాత్రం తడబడకుండా 15.3 ఓవర్లలోనే ఛేదించగలిగింది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (37 బంతుల్లో 77; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే

వరుసగా ఐదో విజయంతో ఎదురులేని ముంబై.. హషీమ్‌ ఆమ్లా మెరుపు సెంచరీ వృథా
హైదరాబాద్ , శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (02:09 IST)
ఇండోర్‌ ఐపీఎల్‌ పదో సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ చెలరేగుతోంది. 199 పరుగుల లక్ష్యాన్ని ఏమాత్రం తడబడకుండా 15.3 ఓవర్లలోనే ఛేదించగలిగింది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (37 బంతుల్లో 77; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో పాటు నితీశ్‌ రాణా (34 బంతుల్లో 62 నాటౌట్‌; 7 సిక్సర్లు) టోర్నీలో మూడో అర్ధ సెంచరీ సాధించగా పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 198 పరుగులు చేసింది. హషీమ్‌ ఆమ్లా (60 బంతుల్లో 104 నాటౌట్‌; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) టి20 కెరీర్‌లో తొలి సెంచరీతో చెలరేగినా లాభం లేకపోయింది. మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడాడు. మెక్లీనగన్‌కు రెండు, కృనాల్‌.. బుమ్రాలకు చెరో వికెట్‌ దక్కింది. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 15.3 ఓవర్లలో రెండు వికెట్లకు 199 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు బట్లర్‌కు దక్కింది. పంజాబ్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి.
 
సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన షాన్‌ మార్ష్ (21 బంతుల్లో 26; 5 ఫోర్లు) ఉన్నంతసేపు బౌండరీలతో మెరిశాడు. ఆరో ఓవర్‌లో తను వెనుదిరగ్గా వృద్ధిమాన్‌ సాహా (15 బంతుల్లో 11) కూడా స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. అయితే ఆమ్లా, కెప్టెన్‌ మ్యాక్స్‌వెల్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను ఉరకలెత్తించారు. 34 బంతుల్లో ఆమ్లా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన మ్యాక్స్‌వెల్‌ మరుసటి ఓవర్‌లో మెక్లీనగన్‌కు చుక్కలు చూపించాడు. వరుసగా 6,6,4,4,6తో రెచ్చిపోవడంతో 28 పరుగులు వచ్చాయి. ఇక 16వ ఓవర్‌లో ఆమ్లా ఒక్కసారిగా జూలు విదిల్చి రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టి 22 పరుగులు అందించాడు. ఈ రెండు ఓవర్లలోనే జట్టుకు 50 పరుగులు రావడం విశేషం. 17వ ఓవర్‌లో బుమ్రా తన అప్పర్‌ కట్‌తో మ్యాక్స్‌వెల్‌ను బౌల్డ్‌ చేసి అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ జోడిని  విడదీశాడు. అప్పటికే మూడో వికెట్‌కు 33 బంతుల్లోనే 83 పరుగులు జత చేరాయి. తర్వాత ఓవర్‌లో స్టొయినిస్‌ (1) అవుట్‌ అయినా చివరి ఓవర్‌లో ఆమ్లా వరుసగా రెండు సిక్సర్లు బాది టి20 కెరీర్‌లో తొలి శతకాన్ని పూర్తి చేశాడు.
 
లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు సంచలన ఆరంభం లభించింది. ఓపెనర్లు పార్థివ్‌ పటేల్, బట్లర్‌ మెరుపు ఆటతో పంజాబ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరి ధాటికి పవర్‌ప్లేలో ముంబై తమ ఐపీఎల్‌ చరిత్రలో అత్యధికంగా 82 పరుగులు సాధించింది. ఇందులో ఆరు మాత్రమే డాట్‌ బంతులుండగా.. 14 బౌండరీలు బాదారంటే వీరిద్దరి జోరును అర్థం చేసుకోవచ్చు. స్టొయినిస్‌ వేసిన ఆరో ఓవర్‌లో పార్థివ్‌ వరుసగా 6,4 బాదినా మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. తొలి వికెట్‌కు 81 పరుగులు జత చేరాయి. ఆ తర్వాత బట్లర్‌కు నితీశ్‌ రాణా జత చేరడంతో స్కోరు అదే వేగంతో దూసుకెళ్లింది.
 
24 బంతుల్లో బట్లర్‌ అర్ధ సెంచరీ చేశాడు. 12వ ఓవర్‌లో రాణా వరుసగా రెండు సిక్సర్లు బాదగా ఆ తర్వాతి ఓవర్‌లో బట్లర్‌ కూడా వరుసగా రెండు సిక్సర్లు కొట్టడంతో చేయాల్సిన రన్‌రేట్‌ బాగా తగ్గిపోయింది. అయితే 13వ ఓవర్‌లో బట్లర్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు మోహిత్‌ శర్మ తెరదించడంతో రెండో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ అప్పటికే మ్యాచ్‌ ముంబై చేతుల్లోకి రావడంతో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. 15వ ఓవర్‌లో రాణా ఓ సిక్సర్‌తో 29 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేయగా హార్ధిక్‌ పాండ్యా (4 బంతుల్లో 15 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఇదే ఓవర్‌లో వరుసగా 6,4,4 కొట్టడంతో చివరి ఐదు ఓవర్లలో లక్ష్యం 8 పరుగులకు చేరింది. దీంతో మరో 27 బంతులుండగానే ముంబై సునాయాసంగా నెగ్గింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూలుగుడు శృంగార సంభోగం... టెన్నిస్ కోర్టే అదిరింది... ఆటగాళ్లు నేలకేసి కొట్టారు(video)