Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయోధ్య రామాలయం వద్ద కిక్కిరిసిన భక్తజనం.. వేకువజామున 3 గంటలకే...

ayodhya devotees crowd

వరుణ్

, మంగళవారం, 23 జనవరి 2024 (08:58 IST)
అయోధ్య రామయ్యను దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటీపడుతున్నారు. తొలి రోజున భక్తులు వేల సంఖ్యలో ఆలయం వద్దకు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులు కిక్కిరిసి పోయారు. వేకువజామున 3 గంటలకే ఆలయం వద్దకు భక్తులు ఒక్కసారిగా భారీ సంఖ్యలో చేరుకోవడంతో అక్కడక్కడా స్వల్ప తోపులాటలు సంభవించాయి. తొలి రోజున సుమారు 5 లక్షల మంది భక్తులు బాల రాముడిని దర్శనం చేసుకోవచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
సోమవారం నుంచి ఈ ఆలయాన్ని ప్రారంభించి బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత మంగళవారం నుంచి సాధారణ భక్తులను దర్శనం కోసం అనుమతిస్తున్నారు. దీంతో శ్రీరాముడిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు తరలివచ్చాయి. 
 
కాగా, భక్తులు ఉదయం 8 గంటల నుంచి బాల రాముడిని దర్శించుకోవచ్చని ఆలయ పెద్దలు చెబుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివుంచుతారని తెలిపారు. ఆలయంలో రెండుసార్లు హారతిని దర్శించుకోవచ్చని, ఉదయం 6.30 గంటలకు, రాత్రి 7.30 గంటల సమయంలో ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇక భక్తులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌‍లో దర్శనం, హారతి పాస్‌లు పొందవచ్చని ఆలయ అధికారులు వెల్లడించారు.
 
బీజేపీ ఆధ్వర్యంలో అయోధ్యకు ప్రత్యేక రైళ్లు 
 
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అయోధ్య నగరానికి ప్రత్యేక రైళ్లను నడుపనుంది. బీజేపీ తెలంగాణ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 200 మంది కార్యకర్తలకు ఈ రైళ్లలో ప్రయాణించే వెసులుబాటులను కల్పించనుంది. ఒక్కో రైలుకు 20 బోగీలు ఉంటాయని, ఒక్కో రైలులో 1400 మంది ప్రయాణించే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ రైళ్లు వివిధ తేదీలలో సికింద్రాబాద్, కాజీపేట్ రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరి వెళ్లనున్నాయి. 
 
ఈ ప్రత్యేక రైళ్లు ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన భక్తులతో ఒక్కో రోజున బయలుదేరి వెళతాయి. మొదట సికింద్రాబాద్ లోక్‌‍సభ నియోజకవర్గం నుంచి ఈ నెల 29వ తేదీన బయలుదేరి వెళుతుంది. ఆ తర్వాత జనవరి 30న వరంగల్, జనవరి 31న హైదరాబాద్, ఫిబ్రవరి 1న కరీంనగర్, ఫిబ్రవరి 2న మల్కాజిగిరి, ఫిబ్రవరి 3న ఖమ్మం, ఫిబ్రవరి 5న చేవెళ్ల, ఫిబ్రవరి 6న పెద్దపల్లి, ఫిబ్రవరి 7న నిజామాబాద్, ఫిబ్రవరి 8న ఆదిలాబాద్, ఫిబ్రవరి 9న మహబూబ్ నగర్, ఫిబ్రబవరి 10న మహబూబాబాద్, ఫిబ్రవరి 11న మెదక్, ఫిబ్రవరి 12న భువనగిరి, ఫిబ్రవరి 13న నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 14న నల్గొండ, ఫిబ్రవరి 15వ తేదీ జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఈ ప్రత్యేక రైలు బయలుదేరి వెళుతుంది. 
 
ఈ రైళ్లలో అయోధ్యకు వెళ్లాలని భావించే భక్తులు సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కాల్సివుంటుంది. అలాగే నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్ నియోజకవర్గాలకు చెందిన వారు కాజీపేటలో రైలు ఎక్కాల్సి ఉంటుంది. అయోధ్యకు వెళ్లే కార్యకర్తలను బీజేపీ రాష్ట్ర నేతలు ఎంపిక చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు...