Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30 నుంచి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు? - మరో ఆరు వందే భారత్ రైళ్ళు కూడా..

amrith bharat express
, శనివారం, 23 డిశెంబరు 2023 (17:35 IST)
దేశంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి భలే డిమాండ్ ఏర్పడింది. ఈ రైళ్లలో ప్రయాణ చార్జీ అధికంగా ఉన్నప్పటికీ ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రయాణికులు అమితాసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇపుడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అయోధ్య వేదికగా డిసెంబర్‌ 30న ఈ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించే అవకాశం ఉంది. తొలుత రెండు రైళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. అలాగే, మరో ఆరు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లనూ ప్రధాని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రైళ్ళపై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
 
అయోధ్యలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ డిసెంబర్‌ 30న ప్రారంభించనున్నారు. అదే రోజు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సేవలను ప్రారంభించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఒకటి ఢిల్లీ - దర్బంగా (బిహార్‌)మార్గంలో ప్రవేశపెట్టనున్నారు. మరో అమృత్‌ భారత్‌ బెంగాల్‌లోని మాల్దా - బెంగళూరు మధ్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 
 
అలాగే, మరో ఆరు వందే భారత్‌ రైళ్లకు సైతం ప్రధాని మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇవి అయోధ్య - ఆనంద్‌ విహార్‌ (ఢిల్లీ), వైష్ణోదేవి - ఢిల్లీ, జాల్నా- ముంబై, కోయంబత్తూర్‌ - బెంగళూరు, అమృత్‌సర్‌ - ఢిల్లీ, మంగళూరు సెంట్రల్‌ - మడ్గావ్‌ మధ్య అందుబాటులోకి రానున్నాయి. 
 
ఇకపోతే, కొత్తగా ప్రవేశపెట్టనున్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లో అధునాత సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నాన్‌ ఏసీ రైలు పుష్-పుల్‌ రైలు. ముందూ వెనుక ఇంజిన్లు ఉంటాయి. దీనివల్ల తక్కువ సమయంలోనే రైలు వేగాన్ని అందుకోవడంతోపాటు, ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఇందులో 22 కోచ్‌లు ఉండనున్నాయి. 
 
వీటిలో 12 సెకండ్‌ క్లాస్‌ త్రీటైర్‌ స్లీపర్‌ కాగా 8 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు, రెండు గార్డు కంపార్ట్‌మెంట్స్‌ ఉంటాయి. ఈ 2 కంపార్ట్‌మెంట్లలోనే కొంత భాగాన్ని మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ రైళ్లు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ రైలు టికెట్‌ ధరలు? ఏయే రూట్లలో వీటిని తీసుకురానున్నారు? వంటి వివరాలు త్వరలో తెలియరానున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : చంద్రబాబు ఇంటికి ప్రశాంత్ కిషోర్