Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్లైట్ సర్వీస్ 3 గంటలకంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే....

flight

వరుణ్

, మంగళవారం, 16 జనవరి 2024 (11:36 IST)
ఇకపై విమాన సర్వీసులు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తగిన చర్యలు తీసుకోనుంది. ఇటీవలికాలంలో విమానాల ఆలస్యం, ఇష్టానుసారంగా విమాన సర్వీసులను రద్దు చేయడంతో వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. దీంతో డీజీసీఏ రంగంలోకి దిగింది. 
 
సోమవారం నూతన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను (ఎస్‌పీ) జారీ చేసింది. ఫ్లైట్ సర్వీసు 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే ఆ విమానాన్ని ఎయిర్ లైన్స్ సంస్థ రద్దు చేసేందుకు డీజీసీఏ వీలు కల్పించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ముందస్తుగానే రద్దు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. 
 
ఎయిర్ పోర్టుల వద్ద రద్దీ నియంత్రణ, ప్రయాణికులకు వీలైనంతగా అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా డీజీసీఏ దీనిని రూపొందించింది. అయితే విమానం రద్దయితే ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు భద్రత కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా బోర్డింగ్‌ల తిరస్కరణ, విమానాల రద్దు, ముందస్తు సమాచారం లేని జాప్యాల సందర్భాల్లోనూ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని అధికారిక ప్రకటనలో పేర్కొంది.
 
కొత్త మార్గదర్శకాలలో భాగంగా విమాన టిక్కెట్లపై సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్ ముద్రిస్తారు. ఈ మార్గదర్శకాలను విమానయాన సంస్థలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అయితే అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే సీఏఆర్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ మధ్య పొగమంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయాలకు సంబంధించి ప్రయాణికుల నుంచి వరుస ఫిర్యాదులు అందిన నేపథ్యంలో డీజీసీఏ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది.
 
డీజీసీఏ జారీచేసిన మార్గదర్శకాల వివరాలను పరిశీలిస్తే, విమానయాన సంస్థలన్నీ విమానాల ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని నిర్దిష్ట సమయంతో సహా ప్రయాణికులకు తెలియజేయాలి. అధికారిక వెబ్‌సైట్, బాధిత ప్రయాణీకులకు మెసేజ్ లేదా వాట్సప్, ఈ-మెయిల్, ఇతర నోటిఫికేషన్ మార్గాల ద్వారా ముందస్తు సమాచారం అందించాలి. ఎయిర్ పోర్టులోని ఎయిర్‌లైన్ సిబ్బంది ప్రయాణికుల పట్ల ఓపికగా నడుచుకోవాలి. విమానాల ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని అర్థమయ్యేలా వివరించాలి. ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలియజేస్తుండాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై రన్‌వేపై కూర్చొని భోజనం చేసిన ప్రయాణికులు.. సారీ చెప్పిన ఇండిగో - ఎందుకో తెలుసా?