Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహారాష్ట్రలో వర్షబీభత్సం : ముంబై - పూణెల్లో 25 మంది మృత్యువాత

మహారాష్ట్రలో వర్షబీభత్సం : ముంబై - పూణెల్లో 25 మంది మృత్యువాత
, మంగళవారం, 2 జులై 2019 (16:54 IST)
మహారాష్ట్రలో వర్షబీభత్సం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముంబై, పూణె నగరాల్లో వర్షం ధాటికి ఇప్పటికే 25 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 
 
అలాగే మంగళవారం మలాడ్‌ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి ఓ ప్రహరీ గోడ కూలి 19 మంది చనిపోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈస్ట్ మలాడ్ ఏరియాలో పింప్రిపాదలో జరిగింది. ఈ గోడ వెనుక భాగంలో నివసిస్తున్న వారిపై శిథిలాలు పడటంతో వారంతా చనిపోయారు. 
 
ఇలాగైతే ఏం చేయగలం.. మావల్ల కాదు బాబోయ్... 
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై వర్షపు నీటిలో మునిగిపోయింది. ప్రస్తుతం ముంబై మహానగరంలో నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ నగరాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకుని రావడం తమ వల్ల కాదని బృహన్ నగర పాలక సంస్థ (బీఎంసీ) అధికారులు చేతులెత్తేశారు. దీంతో ముంబై నగర వాసుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. 
 
ముంబైలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రైళ్లు, విమానాలు, బస్సులు, విద్యుత్.. ఇలా అన్ని సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలైన దాదర్‌లోని హింద్‌మాతా చౌక్, కంజూర్‌మార్గ్, సియాన్ తదితర ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి.
 
మరికొన్ని రోజుల పాటు వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం, సేవలను పునరుద్ధరించడం బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులకు తలకు మించిన భారంగా మారింది. 
 
ఈ పరిస్థితులపై బీఎంసీ కమిషనర్ ప్రవీణ్ పరదేశీ మాట్లాడుతూ.. ముంబైలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 85 శాతం వర్షపాతం నమోదైందన్నారు. జూన్ మొత్తంలో కురవాల్సిన వర్షం నాలుగు రోజుల్లోనే కురిసిందన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా కురవలేదని చెప్పారు. ఈ దశాబ్దంలో ఇలా కురవడం ఇదే తొలిసారని వివరించారు.  
 
జూన్ నెల సగటు వర్షపాతం 550 మిల్లీమీటర్లు కాగా, గత 48 గంటల్లోనే అంతకుమించిన వర్షపాతం నమోదైందని వివరించారు. జనజీవనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమ ప్రయత్నం చేస్తున్నామని, కానీ ఈ స్థాయిలో వర్షం పడుతుంటే తామేమీ చేయలేమని స్పష్టం చేశారు. కాగా, ఈ వర్షాలకు ఇప్పటివరకు 18 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల్లో భారత నౌకాదళ సిబ్బంది నిమగ్నమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిరుద్యోగులకు శుభవార్త.. సీఏపీఎఫ్‌లో 9,99,795 పోస్టులు