Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవాసుని లెక్కలు చూసేదెవరు...? ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓగా ఎక్కడ? వార్షిక ఆదాయంపై పర్యవేక్షణ వెంకన్నకే ఎరుక?

తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్డెట్‌ రూ.2,680రూపాయలు. దాదాపు 80 విభాగాలు. రోజూ దాదాపు 70 వేల మందికిపైగా భక్తులు. 9,500 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు. 13,500మందికిపైగా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ క

శ్రీవాసుని లెక్కలు చూసేదెవరు...? ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓగా ఎక్కడ? వార్షిక ఆదాయంపై పర్యవేక్షణ వెంకన్నకే ఎరుక?
, మంగళవారం, 5 జులై 2016 (12:03 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్డెట్‌ రూ.2,680రూపాయలు. దాదాపు 80 విభాగాలు. రోజూ దాదాపు 70 వేల మందికిపైగా భక్తులు. 9,500 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు. 13,500మందికిపైగా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు. దాదాపు 7 వేల మంది పెన్షనర్లు. ఏడు టన్నుల బంగారు డిపాజిట్లు. రూ.10 వేల కోట్లకుపైగా నగదు డిపాజిట్లు. వందల కోట్ల రూపాయలు కొనుగోలు వ్యవహారాలు. శ్రీవారికి లెక్కలేనన్ని ఆభరణాలు. అనేక ట్రస్టులు, వాటి విరాళాలు, వడ్డీలు, ఆలయాలు, కార్యాలయాలు, కళ్యాణమండపాలు, విద్యాసంస్థలు, వాహనాలు, రోజూ వందల కొద్దీ ఫైళ్ళు.. ఇలా ఎన్నో అందుకే తితిదే పరిపాలన పర్యవేక్షించడానికి ముగ్గురు ఐఎఎస్‌లను, నిఘా-భద్రత బాధ్యతల నిర్వహణకు ఒక ఐపిఎస్‌ను నియమించింది ప్రభుత్వం. అలాగే ఆర్థిక వ్యవహరాలను చూడటానికి ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంక అధికారి ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓగా ఉన్న అధికారితో నెట్టుకొస్తున్నారు. ఈ పోస్టును భర్తీ చేయకపోవడం వెనుక ఎవరి ప్రయోజనమైనా ఉందా..? ముఖ్య గణాంక అధికారిని నియమించకుండా ఎవరైనా అడ్డుపడుతున్నారా.. ఇలాగైతే శ్రీవారి జమా ఖర్చులు చూసేదెవరు..?
 
ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓగా ఉన్న ఎల్‌వి భాస్కర్‌ రెడ్డి వెళ్ళిపోయిన తరువాత (2012)జూలై ఇప్పటిదాకా ఆ పోస్టులో ఎవరినీ నియమించలేదు. ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓ పోస్టును భర్తీ చేసే అధికారం, ఎవరినైనా నియమించే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్ సర్వీసులో కనీసం ఐదేళ్ళ అనుభవం ఉన్న అధికారిగానీ, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖలో డెప్యూటీ సెక్రటరీ కంటే పై స్థాయి పోస్టులో కనీసం ఐదేళ్ళ అనుభవం ఉన్న అధికారిని గానీ, ఛార్టెట్‌ అకౌంటెంట్‌గా కనీసం 10 యేళ్ళ అనుభవం ఉన్న అధికారిగానీ ఈ పోస్టులో మూడేళ్ళ కాలానికి డెప్యుటేషన్‌‌పై నియమించవచ్చు. 
 
ప్రమోషన్‌పై నియమించాలంటే.. తితిదేలో అడిషనల్‌ ఎఫ్ఏ అండ్‌ సిఏఓగా కనీసం ఐదేళ్ళు పనిచేసి ఉండాలి. ఎల్‌వి భాస్కర్‌ రెడ్డి మాతృసంస్థకు వెళ్ళిపోయిన తర్వాత కొత్త అధికారిని నియమించమని కోరుతూ ప్రభుత్వానికి తితిదే లేఖ రాసింది. ఈ మేరకు సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ ఇచ్చిన అధికారుల జాబితాలో మేలైన వారికి ఎంపిక చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. తితిదే ఈఓ, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ 20-9-2013న సమావేశమైంది. ఆ తరువాత ఏమైందో ఎక్కడ బ్రేక్‌ పడిందో గానీ ఇప్పటిదాకా ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓ ఎంపిక చేయలేదు.
 
ఎఫ్ఏ అండ్‌ సిఏఓ నియామకం కోసం తితిదే ఎన్నిసార్లు ప్రభుత్వంపై ఒత్తిడి చేసిందో తెలియదు గానీ, అడిషనల్‌ ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓగా ఉన్న బాలాజీని ఆ పోస్టులో నియమించడానికి మాత్రం గట్టి ప్రయత్నాలే జరిగాయి. ఆ పోస్టుకు అవసరమైన అనుభవం ఆయనకు లేకున్నా నిబంధనలు మినహాయించి బాలాజీని ప్రమోషన్‌పై ఎఫ్‌ఏ అండ్‌ సిఏఈఓగా నియమించాలని తితిదే పాలకమండలిలోనే తీర్మానించారు. బాలాజీని ప్రమోషన్‌పై ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓగా నియమించాలని తితిదే పాలకమండలి మండలిలోనే తీర్మానం చేశారు. 14-11-2003న తితిదేలో ఛీప్‌ అకౌంట్స్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. 19-11-2010వ తేదీన అడిషనల్‌ ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓగా ప్రమేషన్‌ పొందారు. 1-08-2012 నుంచి ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓ కొనసాగుతుండగా 13-09-2014 నాటి పాలకమండలి ముందుకు ఒక ప్రతిపాదన వచ్చింది. బాలాజీని ప్రమోషన్‌పై ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓగా కొనసాగుతుండగా 13-09-2014 నాటి పాలకమండలి ముందుకు ఒక ప్రతిపాదన వచ్చింది. 
 
బాలాజీని ప్రమోషన్‌పై ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓగా నియమించాలన్నది సారాంశం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎఫ్‌ఏ అండ్‌ సిఏఒగా ప్రమోషన్‌పై నియమించాలంటే అడిషనల్‌ ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓ పోస్టులో కనీసం ఐదేళ్ళు పనిచేసి ఉండాలి. ప్రతిపాన వచ్చేనాటికి బాలాజీ అడిషనల్‌ ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓగా గడించిన అనుభవం 3 సంవత్సరాల 9 నెలలు మాత్రమే. అయితే ఐదేళ్ళ అనుభవం నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చి బాలాజీని తితిదే ఎఫ్‌ఏ అండ్‌ సిఓగా నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతూ స్పెసిఫైడ్‌ అథారిటీ తీర్మానాన్ని ఆమోదించింది. అయితే దీనికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయలేదు. దీంతో ఇప్పటిదాకా ఎఫ్‌ఏ అండ్‌ సిఈఏ పోస్టు భర్తీ కాలేదు. బాలాజీకి ఆ పోస్టు లభించకున్నా ఫుల్‌ అడిషనల్‌ ఛార్జిగా దాదాపు నాలుగేళ్ళుగా కొనసాగుతున్నారు.
 
ఎఫ్‌ఏ సిఏఓ పోస్టు భర్తీ చేయడంపై తితిదే ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి ఆశక్తి ఉందా? అనేది అసలు ప్రశ్న. తితిదే అనుకుంటే ప్రభుత్వంలో ఏ పని అయినా క్షణాల్లో అయిపోతుంది. ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు. సివిఎస్‌ఓ, ఎస్టేట్‌ అధికారి, హెల్త్ ఆఫీసర్‌ ఇలా అనేక పోస్టులను డెప్యుటేషన్‌‌పై నియమించిన ప్రభుత్వం అత్యంత కీలకమైన ఆర్థిక వ్యవహారాలను చూడాల్సిన ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓ పోస్టు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ పోస్టు ప్రాధాన్యతను వివరిస్తూ ప్రభుత్వం వెంట పడి ఉంటే ఎఫ్‌ఏ సిఏఓ ఎప్పుడో వచ్చి ఉండేవారని అయితే ఉద్దేశపూర్వకంగానే బాలాజీని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ అంశంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు తితిదేలో వినిపిస్తున్నాయి. 
 
కొన్ని సడలింపులతో బాలాజీని ఎఫ్‌ఏ సిఏఓగా నియమించాలంటూ 2014 స్పెసిఫైడ్‌ అథారిటీ తీర్మానాన్ని ఆమోదించే నాటికి నిబంధనల ప్రకారం అడిషనల్‌ ఎఫ్‌ఏ సిఏఓగా ఆయనకు ఐదేళ్ళ సర్వీసు పూర్తి కాలేదు. గత యేడాది నవంబర్‌ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తయింది. అంటే ప్రస్తుతం ఆయన ఎఫ్‌ఏ సిఏఓ పోస్టులో నియమితులవడానికి అవసరమైన అర్హత సాధించారన్నమాట. ఈ నేపథ్యంలో ఆయన ఎఫ్‌ఏ సిఏఓ నియమించవచ్చని, అందుకే ఇన్నాళ్ళు జాప్యం చేస్తున్నారని అంటున్నవాళ్ళు ఉన్నారు.
 
కేంద్ర ప్రభుత్వ అధికారిని ఎఫ్‌ఏ సిఏఓగా నియమిస్తే తితిదేలోని అధికారులకు, పాలకమండలికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఆదాయపన్ను శాఖ నుంచి వచ్చే అధికారులు నిబంధనలు గట్టిగా పాటించే అవకాశముంది. తితిదే నిధులు వ్యయం చేయడంలో చట్ట పరిధిని దాటడానికి ఎంతైనా అనుమతించకపోవచ్చు. అయితే అనేక కారణాల ఒత్తిళ్ళ వల్ల ప్రస్తుతం చట్ట పరిధి దాటి కూడా తితిదే నిధులు వ్యయం చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఎఫ్ఏ సిఏఈ నుంచి అభ్యంతరం వ్యక్తమయ్యే అవకాశముంది. అందుకే తితిదే ఉన్నతాధికారులు గానీ,  ప్రభుత్వంగానీ ఎఫ్‌ఏ సిఏఓను నియమించేందుకు పూనుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
తితిదే వంటి ప్రతిష్టాత్మక సంస్థకు ఆర్థిక అధికారిగా కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి వచ్చిన అధికారి అయితేనే మేలని పలువురు అంటున్నారు. అయితే డిప్యుటేషన్‌పై నియమించాలా? లేక తితిదేలోనే ప్రమోషన్‌ ద్వారా నియమించాలా? అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఒకటి మాత్రం వాస్తవం. అత్యవసరంగా పూర్తి కాలం ఎఫ్‌ఏ సిఏఓను నియమించాలి. ఒకవేళ బాలాజీని ఆ పోస్టులో నియమిస్తే అడిషనల్‌ ఎఫ్‌ఏ సిఏఓ పోస్టు భర్తీ చేయాలి. బాలాజీకి ప్రమోషన్‌ ఇవ్వాలన్న స్పెసిఫైడ్‌ అథారిటీ తీర్మానంలో పేర్కొన్నట్లు తితిదే ఆర్థిక విభాగం సజావుగా సాగాలంటే పూర్తి కాలం ఎఫ్‌ఏ సిఏఓ పోస్టును భర్తీ చేయడం అత్యవసరం. తితిదే ఈఓ సాంబశివరావు ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనుమంతునికి వడమాల సమర్పిస్తే.. రాహుగ్రహ దోషం పోయినట్లే... ఎందుకంటే...?