రాముడు, కృష్ణుడు, వెంకన్న స్వామి, శివుడు ఇలా స్నప్నంలోకి రావడం పరిపాటి. ఒక్కోసారి తమకి ఆలయాన్ని నిర్మించమని స్వప్నంలోనే భక్తులను ఆదేశించడం జరుగుతూ ఉంటుంది. అయితే సాక్షాత్తు లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు భక్తుల స్వప్నంలోకి రావడమనే చాలా అరుదుగా కనిపిస్తుంది.
అలాంటి అరుదైన సంఘటనకు నిదర్శనంగా 'నందికొట్కూరు' కనిపిస్తుంది. కర్నూలు జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం ఆశ్చర్యచకితులను చేసే ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక చోళ రాజు ఈ ప్రదేశం మీదుగా వెళుతూ ఇక్కడ విశ్రమించడం జరిగిందట. ఆ సమయంలోనే సూర్యభగవానుడు ఆయనకి స్వప్నంలో దర్శనమిచ్చి, తనకి ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించమని చెప్పాడట
స్వామివారి ఆదేశం మేరకు ఆ రాజు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించినట్టు స్థలపురాణంగా వినిపిస్తోంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉదయం వేళలో సూర్యకిరణాలు నేరుగా ఇక్కడి స్వామివారి పాదాలను తాకుతుంటాయి. అద్భుతమైన ఈ దృశ్యాన్ని చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్దసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.
ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన సూర్యగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోయి, సకలశుభాలు చేకూరతాయని ప్రగాఢమైన విశ్వాసం.