Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెంకన్న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ... హైటెక్ సెక్యూరిటీ

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం తితిదే శ్రీకారం చుట్టింది. సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలను ఆరంభించింది. శనివారం సాయంత్రం ధ్వజారోహణంతో పూర్తి స్థాయిలో బ

వెంకన్న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ... హైటెక్ సెక్యూరిటీ
, శనివారం, 23 సెప్టెంబరు 2017 (07:02 IST)
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం తితిదే శ్రీకారం చుట్టింది. సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలను ఆరంభించింది. శనివారం సాయంత్రం ధ్వజారోహణంతో పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతుంది.
 
తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే వేడుకలను తిలకించేందుకు తరలివచ్చే భక్తకోటి కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమల క్షేత్రాన్ని విద్యుద్దీపాలతో, విరులతోరణాలతో అలంకరించింది. శనివారం నుంచి అక్టోబరు ఒకటో తేదీ వరకు ఉదయం, రాత్రి వేళల్లో వాహనసేవలు జరగనున్నాయి. 
 
బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు దేవాలయానికి నైరుతి వైపు వసంత మండపానికి శ్వేతచ్ఛత్రచామర మంగళవాద్యాలతో ఊరేగింపుగా వచ్చారు. ఇక్కడ వేదపండితులు, అర్చకులు మంత్రాలు పఠిస్తుండగా భూమిపూజ, పుట్టమట్టి సేకరణ చేసి ప్రదక్షిణంగా వచ్చి ఆలయప్రవేశం చేశారు. 
 
శ్రీవారి బ్రహ్మూత్సవాలకు విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులు సంతృప్తికరంగా స్వామివారి మూలమూర్తితో పాటు వాహనసేవలను దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తైనట్లు తెలిపారు. 
 
బ్రహ్మోత్సవాల్లో ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు ఆర్జితసేవలతో పాటు వయో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. పెరటాసి మాసం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 23, 27 (గరుడసేవ), 30వ తేదీల్లో దివ్యదర్శనం టోకెన్లు జారీ ఉండదని చెప్పారు. 
 
ఆన్‌లైన్‌లో గదుల ముందస్తు బుకింగ్‌ కోటాను 2 వేల నుంచి వెయ్యికి తగ్గించామని, ప్రతిరోజూ 4 వేల గదులు సాధారణ భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు. బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామన్నారు. శ్రీవారి వాహనసేవలు వీక్షించేందుకు మాడవీధుల్లో 19, ఇతర ప్రాంతాల్లో 11 కలిపి మొత్తం 30 పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 
 
బ్రహ్మోత్సవాల రోజుల్లో 24 గంటల పాటు ఘాట్‌ రోడ్లు, అలిపిరి కాలిబాట మార్గం తెరిచి ఉంటాయన్నారు. గరుడ సేవనాడు శ్రీవారి మెట్టు మార్గాన్ని 24 గంటల పాటు తెరిచి ఉంచుతామన్నారు. ఫలపుష్ప, ఫొటో, మ్యూజియం ఎగ్జిబిషన్లను భక్తులు తిలకించాలని కోరారు.
 
తిరుమలలోని శ్రీవారి ఆలయం, మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో ప్రస్తుతం 640 సీసీటీవీలు ఉన్నాయని, బ్రహ్మోత్సవాల కోసం అదనంగా 70 సీసీటీవీలు ఏర్పాటు చేశామన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీల ద్వారా భక్తుల భద్రతను పర్యవేక్షిస్తామని వివరించారు. 2 వేల మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, 2700 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టు ఆయన వివరించారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా తిరుమలకు శనివారం సాయంత్రం చేరుకోనున్నారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి సాయంత్రం 6.40కి ఇక్కడికి వస్తారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల మధ్య శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి ఆదివారం ఉదయం తిరుగు ప్రయాణమవుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : ఈరోజు రాశిఫలితాలు 23-09-2017