ఆసియన్ గేమ్స్ నేటి నుంచే!: ఫేవరేట్లుగా భారత క్రీడాకారులు!
చైనా వేదికగా ఆసియన్ గేమ్స్ క్రీడోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆసియా దేశాలు మాత్రం పాల్గొనే ఈ పోటీలు నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. దాదాపు 45 దేశాలు పాల్గొనే ఈ పోటీల్లో స్టార్ ఆటగాళ్లు తమ బలాన్ని పరీక్షించుకోనున్నారు. 1951
వ సంవత్సరంలో తొలి ఆసియన్ క్రీడోత్సవాలను నిర్వహించగా, గత 2006 సంవత్సరానికి తర్వాత చైనాలోని గువాగ్జౌలో ఈ ఏడాది చివర్లో ఈ పోటీలు అట్టహాసంగా జరుగనున్నాయి. ఈ నెల 12 నుంచి 27వ తేదీవరకు జరిగే ఈ పోటీల్లో చైనా, భారత్, దక్షిణ కొరియా, పాకిస్థాన్, థాయ్లాండ్, మలేషియా, సింగపూర్త్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్లతో పాటు 45 దేశాలకు చెందిన పదివేల మంది క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. సుమారు 52 క్రీడా స్టేడియాల్లో ఆసియన్ గేమ్స్ జరుగనున్నాయి. ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడోత్సవాలకు తర్వాత ఆసియన్ గేమ్స్ను చైనా ఘనంగా నిర్వహిస్తోంది. ఇకపోతే.. ఆసియా గేమ్స్లో ఆడేందుకుగాను భారీ బృందాన్ని భారత్ చైనాకు పంపింది. ఈ బృందంలో 843 మంది క్రీడాకారులు ఉన్నారు. వీరిలో కోచ్లు, వైద్యులు, అధికారులు మినహా భారత అథ్లెట్లు మాత్రం 609 మంది కావడం విశేషం. మొత్తానికి ఆసియన్ గేమ్స్లో భారత్ 35 పోటీల్లో పాలుపంచుకోనుంది. కామన్వెల్త్ షూటింగ్ పోటీల్లో నాలుగు స్వర్ణ పతకాలు సాధించిన గోల్డెన్ బాయ్ గగన్ నారంగ్, ఒలింపిక్ విజేత అభినవ్ బింద్రా, సమ్రేష్, ప్రపంచ ఛాంపియన్ తేజస్వినిలతో పాటు 36 మంది షూటింగ్ విభాగాల్లో తలపడనున్నారు. 1990
వ సంవత్సరం ప్రవేశపెట్టిన కబడ్డీ పురుషుల విభాగంలో తరచూ బంగారు పతకాన్ని సొంతం చేసుకుంటున్న భారత్కు ఈసారి స్వర్ణం ఖాయమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఆసియన్ గేమ్స్లో మహిళా కబడ్డీ పోటీలను కూడా నిర్వహించనున్నారు.
అలాగే ఆసియన్ గేమ్స్ బ్యాడ్మింటన్ విభాగంలో సైనా నెహ్వాల్, టెన్నిస్లో సానియా మీర్జా, సోమదేవ్ దేవ్వర్మన్, మహిళా బాక్సింగ్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ మేరీకామ్లు బరిలోకి దిగుతున్నారు. ఇంకా హాకీ, అథ్లెట్లిక్, రెజ్లింగ్, బాక్సింగ్, చెస్, హ్యాండ్బాల్, ఆర్చరీ విభాగాల్లో భారత క్రీడాకారులు ఓ మెరుపు మెరుస్తారని అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.