Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

kishan reddy
, గురువారం, 30 నవంబరు 2023 (10:20 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగర పేరు మారుస్తామని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును మారుస్తామన్నారు. అసలు ఎవడు ఈ హైదర్ అని ప్రశ్నించారు ఈ నగరానికి హైదర్ పేరు అవసరమా? అని అడిగారు. హైదర్ ఎక్కడి నుంచి వచ్చాడని, ఎవడికి కావాలి హైదర్ అని ప్రశ్నించారు. బీజేపీ అధికారిలోకి వస్తే మాత్రం హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరిగా మారుస్తామని తెలిపారు. 
 
ప్రస్తుతం మద్రాస్ పేరును చెన్నై, బాంబే పేరును ముంబై, కలకత్తా పేరును కోల్‌కతా, రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా మార్చినపుడు హైదరాబాద్ నగర పేరును భాగ్యనగరంగా మార్చుకోవడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బానిస మనస్తత్వాలతో కూడిన ప్రతి ఒక్కదాని పేరు మారుస్తామని ప్రకటించారు. మేధావుల సలహాలను తీసుకుని మారుస్తామని తెలిపారు. ఆలోచనా విధానాల్లో కూడా మార్పులు తీసుకొస్తామని చెప్పారు. ముస్లింలు అన్ని విధాలుగా వెనుకబడ్డారని, వారి అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. 
 
#TelanganaElections2023 : పోలింగ్ కేంద్రాల్లో ఎంతమంది ఉన్నారు?  
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. మహానగరాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నారు. 
 
ముఖ్యంగా, మహానగరాల్లో పోలింగ్ కేంద్రాల్లో భారీ క్యూలైన్లు, వసతులు లేకపోవడం వంటి కారణాలతో ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారని ఈసీ గుర్తించింది. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులకు ఓ ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. పోలింగ్ కేంద్రాల్లోని క్యూ లైన్లలో ఎంత మంది ఉన్నారో ఇంటి నుంచే తెలుసుకునే వీలు కల్పించింది.
 
https://ghmcbls.in/poll-queue-status వైబ్సైట్ ద్వారా క్యూలైనులో ఎందరు ఉన్నారో, ఓటింగ్‌కు ఎంత సమయం పడుతుందో తెలుసుకుని తగిన సమయంలో ఓటేసి రావచ్చు. వెబ్‌సైట్స్‌లో ఓటర్లు తమ నియోజకవర్గాన్ని ఎంచుకుని, ఆపై తమ పోలింగ్ స్టేషన్‌ను ఎంచుకుంటే ఈ వివరాలు తెలుస్తాయి. ఓటర్లు PollQRoute ద్వారా కూడా ఈ వివరాలు తెలుసుకుని చకచకా ఓటేసీ రావచ్చని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేశామని కూడా ఆయన తెలిపారు. 
 
ప్రశాంతంగా పోలింగ్.. ఓటేసిన సినీ ప్రముఖులు  
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, గురువారం ఉదయం నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థుల భవిత్యం నేడు తేలనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.26 కోట్లు కాగా పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 68 నియోజకవర్గాల్లో మహిళలే అభ్యర్థుల గెలుపు ఓటములు నిర్ణయిస్తారు. ఈ ఎన్నికల్లో యువత సంఖ్య అధికంగా ఉండటం మరో ప్రత్యేకత. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈసారి 18-19 ఏళ్ల వయసున్న 9, 99,667 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
 
పోలింగ్ భద్రతా ఏర్పాట్ల కోసం 75 వేల మంది పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. వీరిలో రాష్ట్రానికి చెందిన 40 వేల మంది, సరిహద్దు రాష్ట్రాలకు చెందిన 15 వేల మంది పోలీసులు, 375 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు ఉన్నాయి. రాష్ట్రంలో సమస్యాత్మకంగా మారిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12,311 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 2 లక్షలకు పైగా సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం నియమించిన 3,800 మంది సెక్టార్ ఆఫీసర్లు, 22 వేల మంది సూక్ష్మ పరిశీలకులు పోలింగును పర్యవేక్షించనున్నారు.
 
శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,32,560 మంది ఓటర్లు ఉండగా భద్రాచలం నియోజకవర్గంలో అత్యల్పంగా 1,48,713 మంది ఓటర్లున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో గరిష్ఠంగా 48 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా బాన్సువాడ, నారాయణపేటలో అత్యల్పంగా ఏడుగురు చొప్పున బరిలో నిలిచారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి కొన్ని నియోజకవర్గాల్లో 55 బ్యాలెట్ యూనిట్లు, మరికొన్నింటిలో రెండు లేదా మూడు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ పూర్తైన నాలుగు రాష్ట్రాలతో పాటూ తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపును డిసెంబర్ 3న చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.
 
మరోవైపు, తెలంగాణలో ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభంకావడంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూకడుతున్నారు. పలువురు ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటు వేశారు. నటుడు ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి వచ్చి జూబ్లీహిల్స్ ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు. సినీనటుడు అల్లు అర్జున్.. జూబ్లీహిల్స్ లోని బీఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్లో ఓటు వేశారు. అందరితో పాటూ లైన్లో నిలబడి ఓటు వేసి వెళ్లారు. షాద్ నగర్లో సినీనటుడు ప్రకాష్ రాజ్ ఓటేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓటుహక్కును వినియోగించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#TelanganaElections2023 : ప్రారంభమైన పోలింగ్.. మొరాయిస్తున్న యంత్రాలు