Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజల్లో నమ్మకం పొందేలా పని చేయండి.. కలెక్టర్లు - ఎస్పీలకు సీఎం రేవంత్ సూచన

revanthreddy
, సోమవారం, 25 డిశెంబరు 2023 (09:41 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. క్రమంగా అటు ప్రభుత్వంతో పాటు ఇటు పాలనపై క్రమంగా పట్టుసాధించేలా అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పని చేస్తున్న ఉన్నతాధికారులపై ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. అయితే, ప్రజల్లో నమ్మకం కలిగేలా పని చేయాలని ఆయన హితవు పలికారు. 
 
'మీరు వివిధ రాష్ట్రాల్లో పుట్టి పెరిగి, ఆలిండియా సర్వీసు పోటీ పరీక్షలు రాసి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా సెలెక్ట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుని ఇక్కడికి వచ్చారు. ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర నిర్మాణంలో పాలుపంచుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడి పౌరులతో మమేకం అయ్యారు.
 
మాది వేరే రాష్ట్రం అనో, మా భాష వేరు అనో మీరెవరూ భావించాల్సిన పనిలేదు. మేమెవరం కూడా మిమ్మల్ని ఆ కోణంలో చూడడంలేదు, ఎలాంటి వివక్ష చూపించడంలేదు. మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి, ప్రజల మనసులు గెలవండి. రాజకీయనేతలకు ఐదేళ్ల కాలపరిమితి, మీకు 35 ఏళ్ల సర్వీసు ఉంటుంది. అన్ని సంవత్సరాల సర్వీసును మీకందిస్తున్నారంటే, మీరు ఎంత జవాబుదారీతనంతో వ్యవహరించాలో అర్థం చేసుకోండి.
 
కొంతమంది అధికారులు బదిలీ అయి వెళ్లిపోతున్నప్పుడు ప్రజలు సన్మానాలు చేయడం చూస్తుంటాం... ఓ మంచి అధికారిని ప్రభుత్వం బదిలీ చేస్తోందని కన్నీరు పెట్టుకుంటారు. మీరు కూడా ప్రజల్లో నమ్మకం పొందేలా పనిచేయండి. మీరు తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా బాధ్యతతో మెలగండి" అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అదేసమయంలో పని చేయని అధికారులకు కూడా ఆయన గట్టివార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి అధికారులు ఇంటికి వెళ్లేలోపు బదిలీ ఆర్డర్లు వస్తాయని హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుమానం పెనుభూతమై... భార్యను కత్తితో పొడిచి చంపి.. భర్త ఆత్మహత్య... ఎక్కడ?