Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీకి ఓటమి భయం... అందుకే ప్రతి రాష్ట్రంలో పొత్తులు పెట్టుకుంటుంది.. సీఎం రేవంత్ రెడ్డి

revanth

ఠాగూర్

, ఆదివారం, 10 మార్చి 2024 (14:26 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ప్రతి రాష్ట్రంలోనూ ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ - జనసేన - బీజేపీల మధ్య కుదిరిన పొత్తుపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఎన్డీయే మొత్తం అతుకుల బొంత అని, ప్రతి రాష్ట్రంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. 
 
400 సీట్లు వస్తాయనే ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ఎందుకు? ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఎందుకు? అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో శివసేనను, ఎన్సీపీ పార్టీలను చీల్చారని ఆరోపించారు. కర్ణాటకకు వెళ్లి దేవెగౌడతో... ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి చంద్రబాబుతో, బీహార్‌లో నితీశ్ కుమార్‌తో పొత్తు పెట్టుకున్నారన్నారు. అక్రమ కేసులు పెట్టి వారితోనే పొత్తులకు దిగారని ఆరోపించారు. 
 
బీజేపీకి కాలం చెల్లిందన్నారు. పదేళ్ల తర్వాత తెలంగాణలో కేడీని ఎలాగైతే బండకేసి కొట్టారో... ఢిల్లీలోని మోడీని బండకేసి కొట్టేందుకు 140 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆ విషయం మోడీకి తెలుసు కాబట్టే అతుకుల బొంతను తయారు చేసుకుంటున్నారన్నారు. పనిలోపనిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కూడా సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 
 
గతంలో ధర్నా చౌక్ వద్దన్న వారు ఇప్పుడు అదే ధర్నా చౌక్ వద్ద ధర్నాలు చేస్తున్నారన్నారు. తాము 43 శాతం మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చామని, నీకు లెక్క కావాలంటే మీ అయ్యను అసెంబ్లీకి పంపించాలని సూచించారు. గతంలో ధర్నా చౌక్ వద్దని... ఇప్పుడు అక్కడే సిగ్గులేకుండా వెళ్లి ధర్నా చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తొలి కేబినెట్‌లో మహిళా మంత్రి ఒక్కరు కూడా లేరని గుర్తు చేశారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటే ప్రతిపక్ష నేత భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
 
అలాగే, తానేమీ అయ్య పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల దీవెనతో వచ్చానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని అంటున్నారని... అంత మొగోడు తెలంగాణలో ఉన్నాదా? అని సవాల్ చేశారు. తమ కార్యకర్తలు తలుచుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు కదా... ఇటుక పెళ్లలు కూడా మిగలవని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలు చేస్తే మా కార్యకర్తలు కళ్లలో కారం కొడతారన్నారు. దోచుకున్న డబ్బుతో వాడినో... వీడినో కొందామని చూస్తున్నారని ఆరోపించారు. కూల్చే సత్తా ఎవరికీ లేదన్నారు. ధైర్యం ఉంటే తమను టచ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని మోడీ పేరెత్తితే భర్తలకు భోజనం పెట్టొద్దు... మహిళలకు కేజ్రీవాల్ పిలుపు