Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొరఢా ఝుళిపించిన ఎన్నికల సంఘం : తెలంగాణాలో కలెక్టర్లు, ఎస్పీలపై వేటు

election commission of india
, గురువారం, 12 అక్టోబరు 2023 (10:48 IST)
తెలంగాణ రాష్ట్రంలో వచ్చేనెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా కొందరు కలెక్టర్లు, ఎస్పీలు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి వారిపై ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించింది. ఇలా ఏకంగా 20 మందిపై వేటు వేసింది. వీరిలో నలుగురు కలెక్టర్లు, హైదరాబాద్ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, ఆబ్కారీశాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్, రవాణాశాఖ కార్యదర్శి ఉన్నారు. 
 
వీరంతా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణలో పనితీరు సంతృప్తికరంగా లేకపోవటంతోనే ఆయా అధికారులను విధుల నుంచి తప్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి నాలుగు లేఖలను బుధవారం పంపించింది. షెడ్యూలు విడుదలకు సుమారు నెల రోజుల ముందు నుంచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగాలను కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దింపింది.
 
రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు ఈ నెల 3 నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, వివిధ విభాగాల అధికారులతో విస్తృత సమీక్షలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి తీసుకున్న చర్యలపై ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. వివిధ స్థాయుల్లో అధికారుల బదిలీలపైనా అసహనం వ్యక్తం చేశారు. 
 
2018 ఎన్నికలు, ఆ తరవాత జరిగిన ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసినా అడ్డుకట్ట వేయకపోవడం ఆందోళన కలిగిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని అధికారులను తప్పించిన నేపథ్యంలో గురువారం సాయంత్రం 5 గంటల్లోగా ప్రత్యామ్నాయ అధికారుల జాబితాను పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఒక్కో అధికారి పోస్టును భర్తీ చేసేందుకు ముగ్గురేసి అధికారులతో జాబితా (ప్యానల్) రూపొందించి పంపించాలని స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో టీడీపీకి షాక్ : సీఎం కేసీఆర్ చెంతకు రావుల చంద్రశేఖర్ రెడ్డి?