Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'చుక్కలు' చూపించిన కృష్ణవంశీ...

'నక్షత్రం' నటీనటులు : సందీప్‌ కిషన్‌, సాయి ధరమ్‌ తేజ్‌, రెజినా, ప్రగ్యా జైస్వాల్‌, ప్రకాష్‌ రాజ్‌, తనీష్‌, శివాజీరాజా, జెడి చక్రవర్తి, తులసి తదితరులు. కెమెరా: శ్రీకాంత్‌ నారోజ్‌, కూర్పు: శివ వై ప్రసాద్‌, సంగీతం : మణిశర్మ, బీమ్స్‌, భరత్‌ మధుసూదన్‌, హ

'చుక్కలు' చూపించిన కృష్ణవంశీ...
, శుక్రవారం, 4 ఆగస్టు 2017 (19:10 IST)
'నక్షత్రం' నటీనటులు : సందీప్‌ కిషన్‌, సాయి ధరమ్‌ తేజ్‌, రెజినా, ప్రగ్యా జైస్వాల్‌, ప్రకాష్‌ రాజ్‌, తనీష్‌, శివాజీరాజా, జెడి చక్రవర్తి, తులసి తదితరులు.
 
కెమెరా: శ్రీకాంత్‌ నారోజ్‌, కూర్పు: శివ వై ప్రసాద్‌, సంగీతం : మణిశర్మ, బీమ్స్‌, భరత్‌ మధుసూదన్‌, హరిగౌర, నిర్మాతలు: కె.శ్రీనివాస్‌, ఎస్‌.వేణుగోపాల్‌, సాజు, రచన, దర్శకత్వం: కృష్ణవంశీ.
 
పోలీసుపై చాలా కథలు వచ్చాయి. ఈమధ్యనే పోలీసు అంటే ఆంజనేయుడులాంటి వాడు, రాముడుని ఎలా రక్షించాడో ప్రజల్నీ రక్షించేవాడూ పోలీసే అంటూ 'రక్షకభటుడు'లో చూపించారు. తాజాగా కృష్ణవంశీ కూడా ఆ పాయింట్‌ను చెబుతూ.. 'భూమిపైకి దిగివచ్చిన నక్షత్రమే పోలీస్‌' అంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. క్రియేటివ్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తను చేసే చిత్రాల్లో ఏదో నూతనత్వం వుంటుందని ఆశిస్తారు. కానీ కొంతకాలంగా ఆశించిన విజయాలు ఆయనకు దక్కలేదు. కానీ ఈ 'నక్షత్రం' దాన్ని పూర్తిచేస్తుందని ఇటీవలే ప్రకటించాడు. మరి అందులో నిజమెంతో చూద్దాం.
 
కథ :
రామారావు(సందీప్‌ కిషన్‌)ది పోలీస్‌ కుటుంబం. మూడు తరాలు పోలీసులే. వంశపారంపర్యంగా తనూ పోలీసు అవ్వాలనే చిన్ననాటి కోరిక. దానికోసం అతి కష్టంమ్మీద ఇంగ్లీషు సబ్జెక్ట్‌ చదివి పాసవుతాడు. ఇక ఫిజికల్‌ టెస్ట్‌కు సిద్ధమై పరీక్షకు హాజరవుతుండగా పోలీసు కమీషనర్‌ ప్రకాష్‌రాజ్‌ కొడుకు తనీష్‌ తన స్నేహితులతో వచ్చి చితకబాది ఉద్యోగం రాకుండా చేస్తాడు. నిరాశతో ఆత్మహత్య చేసుకోయిన రామారావుకు అక్కడా చుక్కెదురే. 
 
విషయం తెలిసిన తల్లి తులసి, పోలీసు అయిన అతని మామయ్య శివాజీరాజా... ప్రజల్ని కాపాడే ప్రతి పౌరుడూ పోలీసే.. అని హితబోధ చేస్తారు. ఆ స్పూర్తితో ఫేక్‌ పోలీసుగా డ్యూటీ చేస్తుండగా సిటీని పేల్చాలనుకున్న బాంబ్‌బ్లాస్ట్‌ గ్యాంగ్‌ను పట్టుకుంటాడు. అప్పటికే కొంత నష్టం జరిగిపోవడంతో రామారావు వేసుకున్న డ్రెస్‌పై అలెగ్జాండర్‌ అని పేరు వుండటంతో.. అతని కోసమే వెతుకుతున్న కమీషనర్‌ రామారావును పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏమయింది? అసలు ఎసిపీ అలెగ్జాండర్‌ ఎవరు? కమీషనర్‌ కొడుకుతో రామారావుకు గొడవేంటి? అనేది తెరపై చూడాల్సిందే.
 
విశ్లేషణ:
పోలీసు అవ్వాలనుకునే రామారావు కథ. దానికి చాలా ఉపకథలుంటాయి. ఇవన్నీ చూసేసరికి పెద్ద సినిమా చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. రామారావుకు వరసైన రెజీనా కొరియోగ్రాఫర్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. అక్కడ ఆమె పడ్డ బాధలు ఇండస్ట్రీపై సెటైర్‌గా చూపించారు. ప్రగ్యా జైస్వాల్‌ పాత్ర సెల్‌ఫోన్లు దొంగతనాలు చేసేదిగా చూపించారు. ఆ తర్వాత తను పోలీసు అధికారిణిగా ట్విస్ట్‌ ఇస్తాడు. ఇలా ఎందుకు చేశాడో క్లారిటీ లేదు. సాయిధరమ్‌ తేజ ఎసీపీ అలెగ్జాండర్‌గా సూటయ్యాడు. కానీ డిగ్నిటికీ తగినట్లుగా పాత్రను డిజైన్‌ చేయలేదు. ప్రకాష్‌రాజ్‌ పాత్ర షరామామూలే. గాడి తప్పిన కొడుకుగా తనీష్‌ నటన సినిమాకు హైలైట్‌. ఇటీవలే డ్రెగ్‌ కేసులో సిట్‌ అధికారుల ముందు హాజరైన అతన్ని సిట్‌ అధికారులు ఈ చిత్రం చూస్తే నిజంగానే డ్రెగ్‌కు బానిస అనిపించేలా జీవించేశాడు. 
 
పోలీస్‌ అవ్వాలనే ఒక యువకుడు కథని తీసుకొని దానిని కాస్తా డిఫరెంట్‌ యాంగిల్‌లో చెప్పాలని చేసిన ప్రయత్నం దర్శకుడు చేసినా పాతకాలపు కథలు చాలా గుర్తుకు వస్తాయి. బాలీవుడ్‌లో ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. సంజయ్‌దత్‌తో పాటు పలువురు పోషించిన పాత్రలే తనీష్‌లో కన్పిస్తాయి. పోలీసు విలువను చెప్పే ప్రయత్నంలో కథను రకరకాలుగా సాగదీస్తూ రెండు సినిమాలు చూసిన ఫీలింగ్‌ను కల్గించాడు కృష్ణవంశీ. దానికితోడు హీరోయిన్లతో అంగాగ ప్రదర్శనలు చూపిస్తూ తన టాలెంట్‌ను మరోసారి రుజువుచేసుకున్నాడు. సంభాషణలు సందర్భానుసారంగా బాగున్నాయి. పోలీసు అవ్వలేకపోయాననే బాధను వ్యక్తం చేసే సన్నివేశాల్లో సందీప్‌ కిషన్‌ నటుడు బయటకువచ్చాడు.
 
లోపాలు:
పోలీసులు మంచివారే అని చెబుతూనే వారిని నెగెటివ్‌గా చూపించకుండా వారి కొడుకు చెడ్డవాడు అనేది తను చెప్పదలిచాడు. కొడుకు చెడు సావాసాలు చేస్తున్నాడని తెలిసినా అతడిని పెద్దగా పట్టించుకోడు. ఏసీపీ అలెగ్జాండర్‌ మానవ బాంబ్‌గా మారి పబ్లిక్‌లో చనిపోతే... తను ఏమయ్యాడనేది కమీషనర్‌కు తెలియకపోగా.. ఆయన కోసమే కథను చివరివరకు నడపడం విడ్డూరంగా అనిపిస్తుంది. చనిపోయేముందు కమీషనర్‌ కొడుకు వచ్చి అలెగ్జాండర్‌ను బయటకు తీసుకువెళితే.. అక్కడే వున్న శివాజీరాజా 'ఎందుకొచ్చాడు వీడు!' అని ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తాడు కానీ.. అలెగ్జాండర్‌ చనిపోయాక.. అతనికి లింక్‌ వుందనే విషయాన్ని మర్చిపోవడం కథలో ప్రధాన లోపం. ప్రతీదీ అప్‌డేటెట్‌గా వుంటానని చెబుతున్న కృష్ణవంశీ.. ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగా ఆలోచించకపోగా.. పాతకాలపు ఫార్మెట్‌తో కథనాన్ని నడపడటం విసుగుపుట్టిస్తుంది.
 
ఇక పాటల్లో వాయిద్యాల హోరు సాహిత్యానికి బ్రేక్‌లు. సీరియస్‌గా సాగే కథకు మళ్ళీ పాటలు బ్రేకులే.. ఇలా పాత కాలపు సినిమాను చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ప్రగ్యా జైస్వాల్‌ పోలీసు అధికారిణిగా బాగా చేసింది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అద్భుతంగా చేసింది. ఇక జెడీ చక్రవర్తి.. ఓ సన్నివేశంలో కమీషనర్‌పై సీరియస్‌ అవ్వడం.. ఆ తర్వాత మరో సన్నివేశంలో ఏరా అనడం.. చిన్ననాటి స్నేహితులుగా చూపించి కన్‌ఫ్యూజ్‌ చేస్తాడు. ఇవి మినహా సినిమాలో పెద్దగా ట్విస్టులు ఆసక్తికర విషయాలు లేవు. సినిమా మొత్తం సంగీతం కథను డిస్టర్బ్‌ చేస్తూ చాలా హెవీగా ఉంటుంది. ఇక ఎడిటర్‌ శివ వై ప్రసాద్‌ చాలావరకు కత్తెరకి పని చెప్పొచ్చు. అనవసరమైన సన్నివేశాలు కథా గమనాన్ని అడ్డుకునే సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయి. అయితే కమర్షియల్‌గా ఏమేరకు ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాల్సిందే.
 
రేటింగ్ ‌: 2/5
- పెండ్యాల మురళీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బలవంతంగా నెట్టేసిన బౌన్సర్లు.. తూలిపడిన అలనాటి నటి... ఎవరు?