Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడీని కడిగేసిన చంద్రబాబు - మెజార్టీకి - మొరాలిటీకి మధ్య సమరం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోమారు కడిగిపారేశారు. మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈనేపథ్యంలో శనివారం ఢిల్

మోడీని కడిగేసిన చంద్రబాబు - మెజార్టీకి - మొరాలిటీకి మధ్య సమరం
, శనివారం, 21 జులై 2018 (16:57 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోమారు కడిగిపారేశారు. మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈనేపథ్యంలో శనివారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడ జాతీయ మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు.
 
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంతన నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఢిల్లీని మించిన రాజధానిని ఏపీకి ఇస్తామని చెప్పారు. ఇపుడు మాట తప్పారని మరోమారు గుర్తు చేశారు. జాతీయ పార్టీతో కలసి ఉంటేనే ఏపీ ప్రయోజనాలను సాధించుకోగలమనే నమ్మకంతో ఎన్నికల సమయంలో బీజేపీతో చేతులు కలిపామని... ఇరు పార్టీలు కలసి ప్రచారాన్ని నిర్వహించామని, కలసికట్టుగా విజయం సాధించామన్నారు. 
 
కానీ, తిరుమల వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఏదీ నెరవేర్చలేదని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న పోరాటం బీజేపీ, టీడీపీ మధ్య కాదని... మెజార్టీకి, మొరాలిటీ (నైతికత)కు మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. విభజన చట్టాలన్నింటినీ అమలు చేస్తామని అమరావతి శంకుస్థాపన సందర్భంగా మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజార్టీ వచ్చిందని లోక్ సభలో మోదీ చెప్పారని... ప్రజా తీర్పును తాము కూడా గౌరవిస్తామని చెప్పారు. 15 ఏళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టింది తామేనని అన్నారు. 
 
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చామని లోక్‌సభలో ప్రధాని మోడీ చెప్పారనీ ఆ డబ్బుతో కనీసం కేబుల్ వర్క్ కూడా పూర్తి కాదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అసలు రూ.1500 కోట్లతో ఢిల్లీలాంటి నగరాన్ని నిర్మించగలమా? అంటూ నిలదీశారు. అమరావతి నిర్మాణం పూర్తయితే రాష్ట్రానికన్నా కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ లాభమన్నారు. 
 
నగరీకరణ, పారిశ్రామికీకరణ వల్ల పలు రకాల పన్నుల రూపేణా కేంద్రానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఏపీకి కేంద్రం సాయం చేయాలే కానీ, ఇలా అవమానించడం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 57 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఏపీకి మంజూరు చేసిన నిధులను కూడా వెనక్కి తీసుకుంటున్నారని మండిపడ్డారు. లోక్ సభలో టీడీపీ ఎంపీలు అద్భుతంగా పోరాడారని కితాబిచ్చారు. తమ ఎంపీలు లోక్‌సభలో పోరాటం చేస్తుంటే, విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కోర్టులో ఉన్నారంటూ గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.99కే 14 జీబీ - అన్‌లిమిటెడ్ కాల్స్.. ఏ కంపెనీ?