Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 2023 చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ - విక్టరీ హీరో జడేజా

csk team celebrations
, మంగళవారం, 30 మే 2023 (08:10 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ముగింపు అదిరిపోయింది. ఆఖరి బంతి వరకు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో చివరి బంతికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు రవీంద్ర జడేజా ఫోర్ కొట్టడంతో సీఎస్కే జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఫలితంగా ఐదోసారి టైటిల్‌ను ఒడిసిపట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆఖరి రెండు బంతుల్లో చెన్నై జట్టుకు పది పరుగులు కావాల్సి ఉండగా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ సిక్సర్, ఓ ఫోర్ కొట్టి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. జడేజా ఈ మ్యాచ్‌లో 6 బంతుల్లో 15 పరుగులు చేయగా, ఈ విలువైన పరుగులే చెన్నై సూపర్ కింగ్స్‌కు టైటిల్ దక్కకడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. 
 
అంతకుముందు టాస్ ఓడిన గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 భారీ స్కోరు చేసింది. తొలి డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్‌ 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగి 96 పరుగులు చేసింది. ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా 39 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 54 రన్స్ చేశాడు. శుభ్‌మన్‌ గిల్‌ 20 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 39 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై బౌలర్లలో పతిరన 2 వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌ చెరో వికెట్‌  తీశారు.
 
గుజరాత్‌ ఆటలో సాయి సుదర్శన్‌ ఇన్నింగ్సే హైలైట్‌. కేవలం 47 బంతులను ఎదుర్కొన్న సుదర్శన్‌ 8 ఫోర్లు, 6 సిక్సర్లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ఒక్కసారిగా ఇన్నింగ్స్‌ రూపమే మారిపోయింది. 33 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్న సుదర్శన్‌.. ఒక్కసారిగా దూకుడు పెంచాడు. 
 
తుషార్ దేశ్‌పాండే వేసిన 17వ ఓవర్‌లో వరుసగా 6,4,4,4 బాదేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పతిరన వేసిన చివరి ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాది సెంచరీకి చేరువయ్యాడు. కానీ, తర్వాతి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య 12 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 21 రన్స్ చేశాడు. 
 
ఆ తర్వాత 215 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇన్నింగ్స్‌కు వరుణ దేవుడు పదేపదే అడ్డుపడ్డాడు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే తొలి వికెట్ కు 6.3 ఓవర్లలోనే 74 పరుగులు జోడించారు. గైక్వాడ్ 26, కాన్వే 47 పరుగులు సాధించి సరైన పునాది వేశారు. వన్ డౌన్‌లో వచ్చిన శివమ్ దూబే చివరి వరకు క్రీజులో నిలిచి 32 పరుగులు చేశాడు. రహానే 27 పరుగులు చేయగా... ఐపీఎల్ కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడుతున్న తెలుగుతేజం అంబటి రాయుడు 8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 19 పరుగులు చేసి మ్యాచ్ లో చెన్నై అవకాశాలను సజీవంగా నిలిపాడు. 
 
ఇక చివరి ఓవర్లో చెన్నై విజయానికి 6 బంతుల్లో 13 పరుగులు అవసరం కాగా... మోహిత్ శర్మ మొదటి మూడు బంతులను యార్కర్లు వేయడంతో క్రీజులో ఉన్న దూబే, జడేజా 2 పరుగులే తీయగలిగారు. నాలుగో బంతి 'లో హైట్' ఫుల్ టాస్ వేసినా శివమ్ దూబే సింగిల్ తోటే సరిపెట్టాడు. ఇక చివరి రెండు బంతుల్లో 10 పరుగులు  అవసరం కాగా... మోహిత్ శర్మ ఏ లెంగ్త్‌లో బంతి వేస్తాడో ముందే పసిగట్టిన జడేజా శక్తికొద్దీ బ్యాట్ ఝుళిపించడంతో బంతి స్టాండ్స్‌లో పడింది. ఆఖరి బంతిని మోహిత్ శర్మ లెగ్ సైడ్ విసరగా, జడేజా తెలివిగా ఫోర్ కొట్టి చెన్నై శిబిరంలో సంతోషాల సునామీని సృష్టించాడు. 
 
విన్నింగ్ షాట్ కొట్టిన జడేజా డగౌట్ వద్దకు రాగానే ధోనీ ఒక్కసారిగా అతడిని పైకెత్తి ఈ విజయం తనకు ఎంత విలువైనదో చాటిచెప్పాడు. ఎందుకంటే, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోకుండా, బౌలింగ్ ఎంచుకున్న ధోనీ... ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయుంటే తప్పకుండా తన నిర్ణయం పట్ల విమర్శలపాలయ్యేవాడు. జడేజా తన అమోఘమైన బ్యాటింగ్ విన్యాసాలతో ధోనీ ముఖంలో నవ్వులు విరబూయించాడు. 
 
కాగా, మ్యాచ్ అనంతరం అంబటి రాయుడు కన్నీటి పర్యంతమయ్యాడు. తన కెరీర్‌లో ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్. దాంతో రాయుడు తీవ్ర భావోద్వేగాలకు గురయ్యాడు. అతడిని ఇతర ఆటగాళ్లు ఆత్మీయంగా హత్తుకుని వీడ్కోలు పలికారు. ఇక, జడేజా వీరోచిత ఇన్నింగ్స్‌ను కళ్లారా చూసిన అతడి అర్ధాంగి రివాబా స్టాండ్స్‌లో ఆనందబాష్పాలు రాల్చింది. చెన్నై డగౌట్ వద్దకు వచ్చి జడేజాను సంతోషంతో హత్తుకుంది. టైటిల్ గెలవడంతో చెన్నై ఆటగాళ్ల సంబరాలు అన్నీ ఇన్నీ కావు. మైదానం అంతా కలియదిరిగి అభిమానులను ఉత్సాహపరిచారు. 
 
ఓవరాల్ గా ఇది చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 5వ ఐపీఎల్ టైటిల్. చెన్నై జట్టు గతంలో 2010, 2011, 2018, 2021 సీజన్లలో విజేతగా నిలిచింది. తాజా టైటిల్‌తో చెన్నై సూపర్ కింగ్స్... ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న అత్యధిక టైటిళ్ల రికార్డును సమం చేసింది. ముంబై ఇండియన్స్ ఐదు పర్యాయాలు ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 2023 ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వగా, రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ రూ.13 కోట్లు అందుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుజరాత్ టైటాన్స్ Vs చెన్నై.. సుదర్శన్ సంచలన ఇన్నింగ్స్