Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖపట్టణంలో దారుణం : బాలికపై పది రోజుల పాటు పది మంది అత్యాచారం..

victim
, సోమవారం, 1 జనవరి 2024 (10:06 IST)
విశాఖపట్టణంలో దారుణం జరిగింది. 17 యేళ్ళ మైనర్ బాలికపై పది మంది కామాంధులు పది రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఉపాధి కోసం ఒడిశా నుంచి వచ్చిన ఓ దళిత బాలికకు ఈ పరిస్థితి ఎదురైంది. ప్రేమ పేరిట తొలుత ప్రియుడు, అతడి స్నేహితుడు అత్యాచారం చేయగా.. ఆ తర్వాత మరో ఎనిమిది మంది మృగాళ్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రైల్వే న్యూకాలనీలో ఓ ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పనికి కుదిరిన బాలికకు భువనేశ్వర్‌కు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఈ నెల 18వ తేదీన బాలికను ప్రియుడు ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం స్నేహితుడిని కూడా హొటల్కు పిలిచి అత్యాచారం చేయించాడు. ప్రియుడు నమ్మించి అఘాయిత్యానికి పాల్పడడంతో మనస్తాపానికి గురవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న బాలికకు ఊహించని మరో దారుణం ఎదురైంది.
 
ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్కే బీచ్‌కు వెళ్లి ఏడుస్తున్న బాధిత బాలికపై పర్యాటకుల ఫొటోలు తీసే ఓ ఫొటోగ్రాఫర్ కన్నేశాడు. మాయమాటలు చెప్పి నగరంలోని జగదాంబ కూడలికి సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. గదిలోనే బంధించి తన స్నేహితులతో కూడా అత్యాచారం చేయించాడు. ఫొటోగ్రాఫర్ సహా ఎనిమిది మంది ఈ దారుణానికి ఒడిగట్టారు. రెండు రోజులపాటు బాలికను చిత్రహింసలకు గురిచేశారు. 
 
ఆ తర్వాత ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకున్న బాలిక... ఒడిశాలోని కలహండి జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోయింది. మానసిక ఆందోళన, భయంతో ఆదివారం వరకు తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక ఎవరికీ చెప్పలేదు. తల్లిదండ్రులతో కూడా పంచుకోలేదు. అయితే విశాఖలో పనిచేసిన ఇంటివారు 18వ తేదీనే బాలిక అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
నాలుగో పట్టణ స్టేషన్ పోలీసులు 22న ఆమెను గుర్తించి ఇక్కడి ఇంటికి చేర్చారు. అప్పుడు బాలిక అసలు విషయాన్ని చెప్పింది. తనకు ఎదురైన పరిస్థితిని వివరించింది. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. నగరానికి చెందిన ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక తొలుత అత్యాచారానికి పాల్పడిన ప్రియుడు, అతడి స్నేహితుడు పరారయ్యారని, ఇద్దరినీ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. జార్ఖండ్, విశాఖ నగరాల్లో గాలిస్తున్నారని సమాచారం.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీ తాగేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు దుర్మరణం.. ఎలా?